కోటేశ్వరరావుకు ఘంటసాల స్మారక పురస్కారం
ABN , First Publish Date - 2021-12-06T05:00:43+05:30 IST
సరిగమ సంగీత పరిషత్ వ్యవస్థాపకుడు శింగవరపు కోటేశ్వరరావు ఘంటసాల శత జయంతి వేడుకల స్మారక పురస్కారం అందుకు న్నారు.
ఆకివీడు, డిసెంబరు 5: సరిగమ సంగీత పరిషత్ వ్యవస్థాపకుడు శింగవరపు కోటేశ్వరరావు ఘంటసాల శత జయంతి వేడుకల స్మారక పురస్కారం అందుకున్నారు. రాష్ట్రస్థాయిలో 19 ఏళ్లు ఏకధాటిగా ఆకివీడులో ఘంటసాల ఆరాధన ఉత్సవాలు నిర్వహించడంతో ఆయన అవార్డుకు ఎంపిక య్యారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నుంచి కోటేశ్వరరావు పురస్కారాన్ని అందుకున్నారు. ఘంటసాల తెలుగువారి గుండె చప్పుడు అని జస్టిస్ ఎన్వీ.రమణ అన్నారని కోటేశ్వరరావు తెలిపారు. ఘంటసాల తన గానామృతంతో పండిత పామరులను ఆలరించారన్నారు. తనకు అందించిన పురస్కారం సంగీత ప్రియులకు అంకితమన్నారు. ఘంటసాల శత జయంతి వేడుకల్లో కార్యక్రమంలో మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, మాజీ ఎంపీ మురళీమోహన్, సినీ నటుడు నారాయణమూర్తి, తదితరులు ఉన్నారు. కోటేశ్వరరావు అవార్డు అందుకోవడంపై సరిగమ సంగీత పరిషత్ కార్యదర్శి కొల్లి వెంకన్నబాబు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.