వివాదాస్పద భూమి స్వాధీనం
ABN , First Publish Date - 2021-01-20T05:48:27+05:30 IST
గిరిజన, గిరిజనేతరుల మధ్య ఘర్షణలకు కారణమైన వివాదస్పద అటవీ భూమిని కన్నాపురం అటవీశాఖ అధికారులు మంగళవారం స్వాదీనం చేసుకున్నారు.

బుట్టాయగూడెం, జనవరి 19: గిరిజన, గిరిజనేతరుల మధ్య ఘర్షణలకు కారణమైన వివాదస్పద అటవీ భూమిని కన్నాపురం అటవీశాఖ అధికారులు మంగళవారం స్వాదీనం చేసుకున్నారు. బుట్టాయగూడెం పోలీసుల రక్షణలో ఉన్న భూమి చుట్టూ ఎక్స్కవేటర్తో కందకం తవ్వించారు. కొంతకాలంగా ఏజెన్సీలోని అటవీ భూములు తమకే చెందుతాయంటూ రెడ్డిగూడెంకు చెందిన స్థానిక గిరిజనులు చెబుతున్నారు. ఇటీవల గిరిజన, గిరిజనేతరులు ఆయు ధాలతో దాడులు చేసుకున్నారు. కొందరు గిరిజనులను పోలీసులు అరెస్టు చేశారు. రెడ్డిగూడెం గిరిజనులు పోడు భూములు పంచాలని, అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని 27 రోజులపాటు రెవెన్యూ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు కూడా చేశారు. ఇటీవలే ఆర్డీవో దీక్షలను విరమింప జేశారు. వివాదాస్పద భూమి అటవీశాఖదే కావడంతో స్వాధీనం చేసుకుని కందకం ఏర్పాటు చేసినట్లు రేంజర్ కృష్ణకుమారి తెలిపారు. మొత్తం 34.96 హెక్టార్ల భూమి ఉందన్నారు.