వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రభుత్వం పెద్దపీట
ABN , First Publish Date - 2021-11-29T05:03:28+05:30 IST
వైసీపీ అధికారంలో కి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విమర్శించారు.

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
పెదవేగి, నవంబరు 28 : వైసీపీ అధికారంలో కి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విమర్శించారు. పెదకడిమిలో ఆదివారం పర్యటించిన ఆయన ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క చాన్స్ అంటూ ప్రాధేయపడితే నమ్మి ప్రజలు అధికారం ఇస్తే వైసీపీ నమ్మక ద్రోహం చేసిందన్నారు. రెండున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం ప్రతిపక్షాన్ని అణచివేయాలనే లక్ష్యంతో పనిచేస్తోందని, ప్రభుత్వ చర్యలను ఖండించే వారిపై దాడులకు తెగబడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని ప్రజలు గమనిస్తున్నారని, తగిన రీతిలో జవాబు ఇస్తారన్నారు. గ్రామ సర్పంచ్ కొసరాజు బలరామకృష్ణచౌదరి, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.