రామతీర్థంలో శాస్త్రోక్తంగా పూజలు
ABN , First Publish Date - 2021-01-27T05:23:53+05:30 IST
రామతీర్థంలోని బాలాలయంలో సీతారామలక్ష్మణుల విగ్రహాల ప్రతిష్ట ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం వైఖానస ఆగమ పండితుల ఆధ్వర్యంలో పూజలు ఘనంగా జరిగాయి. కొండపై ఉన్న కోదండరాముని ఆలయంలో శాశ్వతంగా ప్రతిష్టాపన చేయాల్సిన ఈ విగ్రహాలను ప్రధాన ఆలయంలోని బాలాలయంలో తాత్కాలికంగా ప్రతిష్ట చేస్తున్న సంగతి విదితమే.
నెల్లిమర్ల, జనవరి 26: రామతీర్థంలోని బాలాలయంలో సీతారామలక్ష్మణుల విగ్రహాల ప్రతిష్ట ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం వైఖానస ఆగమ పండితుల ఆధ్వర్యంలో పూజలు ఘనంగా జరిగాయి. కొండపై ఉన్న కోదండరాముని ఆలయంలో శాశ్వతంగా ప్రతిష్టాపన చేయాల్సిన ఈ విగ్రహాలను ప్రధాన ఆలయంలోని బాలాలయంలో తాత్కాలికంగా ప్రతిష్ట చేస్తున్న సంగతి విదితమే. ప్రతిష్ట ఉత్సవాల్లో రెండో రోజు మంగళవారం వేకువజామున తొలుత ప్రాతఃకాల అర్చనతో పూజలు ప్రారంభమయ్యాయి. ఉదయం విశ్వక్షేన ఆరాధన, పుణ్యాహవచనం నిర్వహించారు. యాగశాలలో పంచగవ్య ఆరాధన, పంచగవ్య ప్రాశన, అగ్ని ప్రతిష్టాపన, నవగ్రహ ఆరాధన, వాస్తుపూజ, హోమం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమాల్లో అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు, శిష్య బృందంతో పాటు ఆలయ అర్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులు, కిరణ్, పవన్కుమార్, పాణంగిపల్లి ప్రసాద్, గొడవర్తి నరసింహాచార్యులు, రామ్గోపాలాచార్యులు పాల్గొన్నారు. ఏసీ రంగారావు పర్యవేక్షించారు. ఈ పూజా ప్రక్రియను ఎంఎల్ఎ బడ్డుకొండ అప్పలనాయుడు, దేవదాయ శాఖ ఆర్జేసీ డి.భ్రమరాంబ, డీఈ సైదా తదితరులు మంగళవారం పరిశీలించారు. సీతారామలక్ష్మణ విగ్రహాలను తాత్కాలికంగా ప్రతిష్టించనున్న బాలాలయాన్ని కూడా వారు పరిశీలించారు.