ఇంజినీరింగ్ ప్రవేశాలకు వేళాయె
ABN , First Publish Date - 2021-10-25T06:02:50+05:30 IST
2021-22 విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు ఏపీఈఏపీ సెట్ రాసిన అభ్యర్థులకు సోమవారం నుంచి వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది పూర్తిస్థాయిలో ఆన్లైన్లోనే సర్టిఫికెట్ల పరిశీలన, కళాశాలలు, కోర్సుల ఎంపిక, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ఉంటుంది.

నేటి నుంచి వెబ్ కౌన్సెలింగ్
విజయనగరం, పార్వతీపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో హెల్పింగ్ కేంద్రాలు
కలెక్టరేట్, అక్టోబరు 24: 2021-22 విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు ఏపీఈఏపీ సెట్ రాసిన అభ్యర్థులకు సోమవారం నుంచి వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది పూర్తిస్థాయిలో ఆన్లైన్లోనే సర్టిఫికెట్ల పరిశీలన, కళాశాలలు, కోర్సుల ఎంపిక, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ఉంటుంది. ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా, విజయనగరం , పార్వతీపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏర్పాటుచేసిన హెల్పింగ్ కేంద్రాలను సంప్రదించవచ్చు. ఈ నెల 25 నుంచి 30వ తేదీలోగా రిజిసే్ట్రషన్, ప్రొసెసింగ్ ఫీజు చెల్లింపు, 26 నుంచి 31 వరకూ ధ్రువ పత్రాల పరిశీలన ఉంటుంది. నవంబరు 1 నుంచి 5వ తేదీలోగా కళాశాలలు, కోర్సుల ఎంపికకు ఆప్షన్ ఇస్తారు. నవంబరు 6వ తేదీన వాటిలో మార్పులు, చేర్పులకు అవకాశం ఇచ్చారు. అనంతరం ఫ్రీజ్ ఆఫ్షన్ను క్లిక్ చేయాలి. వచ్చే నెల 10న సీట్ల కేటాయింపు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. నవంబరు 15వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ఎంవీజీఆర్, లెండి, సీతం, జేఎన్టీయూ, మిరాకిల్, వివేకానంద తదితర కళాశాలలు ఉన్నాయి. ఏపీఈఏపీ సెట్ హాల్ టిక్కెట్, ర్యాంకు కార్డు, పదో తరగతి, ఇంటర్ విద్యార్హతకు సంబంధించిన మార్కుల జాబితా, నాల్గో తరగతి నుంచి ఇంటర్ వరకూ స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువపత్రాలతో ఆయా విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏర్పాటుచేసిన హెల్పింగ్ కేంద్రాలను అభ్యర్థులు వినియోగించుకోవాలని విజయనగరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, సమన్వయకర్త డాక్టర్ విలియం కేరీ కోరారు.