మరో భూసేక‘రణం’!

ABN , First Publish Date - 2021-09-04T04:25:31+05:30 IST

వరుస భూసేకరణలతో ఆందోళనకు గురవుతున్న కొత్తవలస మండల రైతులకు మరో పిడుగులాంటి వార్త. హెచ్‌పీసీఎల్‌ పైపులైన్‌ నిర్మాణానికి సంబంధించి అవసరమైన భూసేకరణకు సహకరించాలని స్థానిక రెవెన్యూ అధికారులకు ఆదేశాలొచ్చాయి.

మరో భూసేక‘రణం’!
రామలింగపురంలో సర్వేకు సిద్ధం చేసిన దృశ్యం




తెరపైకి హెచ్‌పీసీఎల్‌ పైపులైన్‌ నిర్మాణం

గ్రామాల్లో ప్రారంభమైన సర్వే

కొత్తవలస,  సెప్టెంబరు 3: వరుస భూసేకరణలతో ఆందోళనకు గురవుతున్న కొత్తవలస మండల రైతులకు మరో పిడుగులాంటి వార్త. హెచ్‌పీసీఎల్‌ పైపులైన్‌ నిర్మాణానికి సంబంధించి అవసరమైన భూసేకరణకు సహకరించాలని స్థానిక రెవెన్యూ అధికారులకు ఆదేశాలొచ్చాయి. ఈ మేరకు గ్రామాల వారీగా సేకరించాల్సిన భూమి వివరాల జాబితా తహసీల్దారు రమణారావుకు అందింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి గ్రామాల్లో సర్వే పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి, ఐవోసీ పైప్‌లైన్‌, పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి భూసేకరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. రైతుల నుంచి నిలదీతలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అదే గ్రామాల్లో హెచ్‌పీసీఎల్‌ పైపులైన్‌ నిర్మాణానికి భూ సేకరణ చేపట్టాల్సి ఉండడం అధికారులకు తలనొప్పిగా మారుతోంది. పోలవరం ఎడమ కాలువ కోసం గులివిందాడ, చీపురువలస,  చీడివలస, రామలింగపురం, దేవాడ గ్రామాలలో భారీగా భూములు సేకరిస్తున్నారు. ఇప్పుడు అదే గ్రామాల్లో మరోసారి సేకరించాల్సి రావడంతో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొవాల్సి ఉంటుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. 





Updated Date - 2021-09-04T04:25:31+05:30 IST