వినతుల సత్వర పరిష్కారానికి చర్యలు
ABN , First Publish Date - 2021-10-26T05:13:05+05:30 IST
ప్రజా వినతుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూర్యకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్ర మానికి వినతులు వెల్లువెత్తాయి.

కలెక్టర్ వెల్లడి
‘స్పందన’కు వినతుల వెల్లువ
కలెక్టరేట్: ప్రజా వినతుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూర్యకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్ర మానికి వినతులు వెల్లువెత్తాయి. వివిధ సమస్యలపై మొత్తంగా 249 వినతులు రాగా, వాటిని ఆయా శాఖాధికారులకు పంపించారు. డీసీహెచ్ఎస్కు 25, జిల్లా వైద్యాధికారికి6, డీఆర్డీఏ 51, రెవెన్యూ 116, మాన్యువల్గా మరో 51 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఒక అంశంపై వినతిపత్రం ఇచ్చిన వారు రెండోసారి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనివల్ల కలెక్టరేట్కు వచ్చే అర్జీల సంఖ్య తగ్గుతుందని చెప్పారు. రెవెన్యూ , గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ తదితర శాఖల్లో పెండింగ్లో ఉన్న దరఖా స్తులను వెంటనే పరిష్కరించాలని కోరారు. జేసీలు కిషోర్కుమార్, మహేష్ కుమార్, మయూర్ అశోక్, వెంకటరావు, డీఆర్వో గణపతిరావు పాల్గొన్నారు. జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొని కాంస్య పతకాన్ని సాధించిన కొప్పెర్ల బాలయోగి కళాశాల ఇంటర్ (ఎంపీసీ, రెండో సంవత్సరం) విద్యార్థి ఎం.సత్యంను కలెక్టర్ అభినందించారు.
అభ్యంతరాలు తెలియజేయండి
వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్లో అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా అంద జేయాలని కలెక్టర్ సూచించారు. ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, జలవనరులు, గ్రామీణ నీటి సరఫరా, విద్యా శాఖలకు ఎలాంటి నష్టం జరుగుతున్నా వెంటనే వివరాలు అందజేయాలని సూచించారు. ఇప్పటికే తహసీల్దార్ల కార్యాలయాల్లో మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ ప్రదర్శించామన్నారు. దీని ఆధారంగా జిల్లాలోని ఏ శాఖకు ఎలాంటి నష్టం జరుగుతుందో తెలియజేస్తే మార్చడానికి వీలవుతుందని చెప్పారు. రాత పూర్వక అభ్యంతర కాపీని జేసీ కిషోర్ కుమార్కు అందించాలని సూచించారు.
భూ ఆక్రమణలపై స్పందించండి
కోనాడ రెవెన్యూ పరిధిలో సుమారు 30 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని, దీనిపై అధికారులు స్పందించాలని పూసపాటిరేగ టీడీపీ నేతలు పతివాడ నారాయణస్వామినాయుడు, ఎ.ప్రసాదరావు తదితరులు కోరారు. అనం తరం స్పందనలో వినతిపత్రం ఇచ్చారు. తమ పొలాల్లో కొబ్బరి మొక్కలు నాశ నం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పూసపాటిరేగ మండలం కిలుగు పేటకి చెందిన దారపు పెంటయ్య, నాయిన ఆదినారాయణ రెడ్డి, నర్సింగరావు తదితరులు కోరారు. కోనాడ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 275లో 8.62 సెంట్లలో కొబ్బరి మొక్కలు వేసుకోగా, కొందరు నరికేశారని వినతిపత్రంలో పేర్కొన్నారు.
చెరువులను పరిరక్షించాలని..
విజయనగరం మండలం రాకోడులో చెరువు ఆక్రమణలపై స్పందించాలని టీడీపీ జిల్లా నాయకులు కలెక్టర్ సూర్యకుమారికి వినతిపత్రం ఇచ్చారు. రాకోడు లోని సర్వేనెంబరులో పాత చెరువు ఆక్రమణకు గురవడంతో నీటి నిల్వ సామ ర్ధ్థ్యం తగ్గిపోయిందని, వ్యవసాయానికి, చేపల పెంపకం , పశుపోషణకు నష్టం వాటిల్లుతోందని చెప్పారు. దీనిపై ఆయకట్టు రైతులు ఫిర్యాదు చేసి రెండు నెలలు కావస్తున్నా, ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదన్నారు. టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, బొద్దల నర్సింగరావు, వి.శ్రీనివాసరావు, తుంపల్లి రమణ, కనకల మురళీమోహన్ తదితరులు ఉన్నారు.
గ్రీన్ అంబాసీడర్ల నిరసన
తమ సమస్యలు పరిష్కారించాలని గ్రీన్ అంబాసీడర్లు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. జీవో నెంబరు 57 ప్రకారం రూ.10 వేలు జీతం ఇవ్వా లని డిమాండ్ చేశారు. ప్రతి నెలా జీతాలు చెల్లించాలని, మృతి చెందిన కార్మికునికి దహన ఖర్చులకు రూ.15 వేలు మంజూరు చేయాలని కోరారు.
విలీనం చేయొద్దు
దాసన్నపేట: ఏపీ గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థను మాంస అభివృద్ధి సంస్థలో విలీనం చేసే ప్రతిపాదనను విరమించాలని జిల్లా గొర్రెల, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ మన్యాల కృష్ణ స్పందనలో జేసీ మహేష్కుమార్కి వినతిపత్రం ఇచ్చారు. విలీనంతో పెంపకందారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని చెప్పారు.