శంభో శంకర
ABN , First Publish Date - 2021-11-30T04:50:39+05:30 IST
హర.. హర.. మహాదేవ.. శంభో.. శంకర.. నామస్మరణతో జిల్లాలోని శివాలయాలు మార్మోగాయి. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు శైవ క్షేత్రాలకు క్యూ కట్టారు.
భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు
విజయనగరం (ఆంధ్రజ్యోతి), నవంబరు 29:
హర.. హర.. మహాదేవ.. శంభో.. శంకర.. నామస్మరణతో జిల్లాలోని శివాలయాలు మార్మోగాయి. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు శైవ క్షేత్రాలకు క్యూ కట్టారు. చిన్న ఆలయాల్లో సైతం బారులుతీరారు. రోజంతా స్వామి దర్శనాలు, పూజలు, అర్చనలు, అభిషేకాలు, ఉపవాస దీక్షలతో ఆధ్యాత్మిక శోభ కనిపించింది. ఉదయం 3గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయాల ధ్వజస్తంభాల వద్ద మహిళలు అఖండ దీపారాధన చేపట్టారు. విజయనగరంలోని వీర రాజేశ్వర స్వామి ఆలయం (మూడు కోవెళ్లు), శివాలయం వీధిలోని ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం, కొత్త అగ్రహారంలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయాల్లో మహిళా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో రింగురోడ్డులోని ప్రైవేటు కళ్యాణ మండపంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణం జరిగింది. రాత్రి 8 గంటలకు అఖండదీపారాధన నిర్వహించారు. జ్ఞానసరస్వతి ఆలయంలో తులాభారం, సామూహిక అక్షరాభ్యాసాలు జరిగాయి. పార్వతీపురం, కొమరాడ, బొబ్బిలి, సాలూరు, ఎస్.కోటలోని పుణ్యగిరి ఆలయం, ధర్మవరంలోని సన్యాసేశ్వర ఆలయాల్లో కార్తీకశోభ ఉట్టిపడింది.