శభాష్ కండక్టర్
ABN , First Publish Date - 2021-10-29T04:34:56+05:30 IST
సాలూరు ఆర్టీసీ డిపో కండక్టర్ శ్రీనివాసరావు తనకు దొరికిన రూ.4 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదును పోగొట్టుకున్న వ్యక్తికి అప్పగించి నిజాయితీని చాటుకున్నారు. విశాఖ నుంచి వస్తున్న సాలూరు డిపోకు చెందిన బస్సులో బాబామెట్టకు చెందిన దేవర రాధాకృష్ణ భార్యతో కలసి ప్రయాణించారు.

రూ.4 లక్షల విలువైన ఆభరణాలు, రూ.10 వేల నగదు అప్పగింత
సాలూరు రూరల్, అక్టోబరు 28: సాలూరు ఆర్టీసీ డిపో కండక్టర్ శ్రీనివాసరావు తనకు దొరికిన రూ.4 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదును పోగొట్టుకున్న వ్యక్తికి అప్పగించి నిజాయితీని చాటుకున్నారు. విశాఖ నుంచి వస్తున్న సాలూరు డిపోకు చెందిన బస్సులో బాబామెట్టకు చెందిన దేవర రాధాకృష్ణ భార్యతో కలసి ప్రయాణించారు. బంగారు నగలు, డబ్బు ఉన్న బ్యాగ్ను సీటుపై ఉన్న క్యారేజ్లో పెట్టారు. విజయనగరం వచ్చాక బ్యాగ్ మరిచిపోయి దిగిపోయారు. బస్సులో బ్యాగ్ను చూసిన కండక్టర్ శ్రీనివాసరావు దానిని భద్రపరిచారు. అంతలో బాధితుడు రాధాకృష్ణ విజయనగరం డిపో మేనేజర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఆయన బస్సు కండక్టర్కు ఫోను చేశారు. అప్పటికే ఆ బస్సు విజయనగరం దాటిపోయింది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో విజయనగరం చేరుకున్నాక డిపో మేనేజర్ శ్రీనివాసరాజు,సెక్యూరిటీ హెడ్ సత్యం సమక్షంలో కండక్టర్ శ్రీనివాసరావు బ్యాగును రాధాకృష్ణకు అందజేశారు. కండక్టర్ను అందరూ అభినందించారు.