పింఛన్లు పునరుద్ధరించండి
ABN , First Publish Date - 2021-09-04T05:28:41+05:30 IST
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, విభిన్న ప్రతిభావంతుల పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిరసన తెలిపారు.

అర్హులకు న్యాయం చేయాలి
టీడీపీ నేతల డిమాండ్
జిల్లావ్యాప్తంగా నిరసన
ప్రభుత్వ తీరుపై మండిపాటు
(ఆంధ్రజ్యోతి బృందం )
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, విభిన్న ప్రతిభావంతుల పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిరసన తెలిపారు. జిల్లాకేంద్రంతో పాటు అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ర్యాలీ, ధర్నాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, దివ్యాంగుల పింఛన్లను వివిధ కారణాలతో రద్దు చేయడం తగదన్నారు. సామాజిక పింఛన్లు ఒక నెల తీసుకోకపోతే రద్దు చేస్తామనడం ఎంతవరకు సమంజసమని టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఒక రేషన్ కార్డుపై ఒక పింఛన్ ఇస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మూడు నెలల వరకూ పింఛన్ రద్దయ్యేది కాదని వారు గుర్తు చేశారు. పింఛన్ పెంపుదలపై సీఎం జగన్ తన హామీ నిలబెట్టుకోవాలన్నారు. తక్షణమే అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని కోరారు.జిల్లాలో లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు.