మహాకవికి గౌరవం
ABN , First Publish Date - 2021-10-29T04:31:52+05:30 IST
విజయనగరంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చుతూ... దీనికి గురజాడ యూనివర్సిటీగా నామకరణం చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అమరావతిలో గురువారం సమావేశమైన కేబినెట్ మరికొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించింది.

జేఎన్టీయూ ఇక ‘గురజాడ విశ్వవిద్యాలయం’
కేబినెట్ ఆమోదం
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
విజయనగరంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చుతూ... దీనికి గురజాడ యూనివర్సిటీగా నామకరణం చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అమరావతిలో గురువారం సమావేశమైన కేబినెట్ మరికొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించింది. ప్రస్తుతం విజయనగరం పట్టణ శివారున ఉన్న కొండపై జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల నడుస్తోంది. దీనిని యూనివర్సిటీగా మార్చేందుకు ఇప్పటికే నిర్ణయించారు. తాజాగా మంత్రివర్గం కూడా ఆమోదించింది. దీంతో విజయనగరంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గిరిజన విశ్వవిద్యాలయం, గురజాడ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఇదిలా ఉండగా విశాఖలోని శారదా పీఠాధిపతికి జిల్లాలో భూములు అందించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ అంశంపై ఎప్పటినుంచో ప్రభుత్వం చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మూడు ప్రాంతాల్లో భూములను పరిశీలించింది. ఆ సమాచారాన్ని పీఠాధిపతి అనుమతి కోసం పంపించినట్లు సమాచారం. మంత్రివర్గం మాత్రం కొత్తవలస మండలంలో 15 ఎకరాలు అందించేందుకు ఆమోదం తెలిపింది. భోగాపురం మండలం కౌలువాడ సమీపంలో ఒక చోట 15 ఎకరాలు, మరో చోట 15 ఎకరాలు డీ పట్టా భూములను పరిశీలించారు. కొత్తవలస మండలం దెందేరు వద్ద కొండ పోరంబోకు 15ఎకరాలు పరిశీలించారు. చివరికి కొత్తవలస మండలం వద్ద 15 ఎకరాలు అందించేందుకు నిర్ణయించారు. ఈ భూముల్లో పీఠాధిపతి ఆధ్యాత్మిక కార్యక్రమాల విస్తరణకు వినియోగించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం అందిస్తున్న అమ్మఒడి పథకానికి నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. విద్యార్థి హాజరు 75శాతం ఉంటేనే పథకాన్ని వర్తింపజేయాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా మావోయిస్టు పార్టీలపై నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగించేందుకు మంత్రి మండలి నిర్ణయించింది.