కొవిడ్ నిబంధనలు పాటించాలి : ఎస్పీ
ABN , First Publish Date - 2021-06-23T05:05:04+05:30 IST
జిల్లాలో కరోనా కేసులు తగ్గుతున్నా నిర్లక్ష్యం చేయకుండా ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఎస్పీ రాజకుమారి అన్నారు.
![కొవిడ్ నిబంధనలు పాటించాలి : ఎస్పీ](https://media.andhrajyothy.com/appimg/galleries/1921062211334824/06222021233437n17.gif)
విజయనగరం క్రైం : జిల్లాలో కరోనా కేసులు తగ్గుతున్నా నిర్లక్ష్యం చేయకుండా ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఎస్పీ రాజకుమారి అన్నారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని కోట సెంటర్, మూడులాంతర్లు జంక్షన్, అంబేడ్కర్ కూడలి తదితర ప్రాంతాల్లో ఎస్పీ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ఫ్యూ సడలింపు సమయంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు. కరోనా నివారణకు ప్రజలంతా స్వీయ నియంత్రణ తప్పనిసరని సూచించారు. కేసుల నమోదు సంఖ్య తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రజలంతా మరింత జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ అనిల్కుమార్, మోహనరావు, శేషాద్రి, సీఐలు మురళి, లక్ష్మణరావు, ఎస్ఐలు బాలాజీరావు, హరిబాబు నాయుడు ఉన్నారు.
- బాడంగి : కరోనా నేపథ్యంలో కర్ఫ్యూ పక్కాగా అమలు చేస్తున్నట్టు ఎస్ఐ నరేష్ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకు కర్ఫ్యూ నుంచి సడలింపు ఉందని, ఈ సమయంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని కోరారు. బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటించాలని సూచించారు.
జగదీష్ కుటుంబానికి ఆర్థిక సాయం
విజయనగరం క్రైం : జిల్లా కేంద్రంలోని గాజులరేగకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ రౌతు జగదీష్ కుటుంబానికి ఆర్థిక సాయం అంజేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 3న ఛత్తీస్ఘడ్లో మావోయిస్టుల దాడిలో జగదీష్ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో అతడి కుటుంబానికి జిల్లా నుంచి సీఆర్పీఎఫ్లో పనిచేస్తున్న సుమారు 400 మంది అండగా నిలిచారు. వీరంతా కలసి అందించిన మొత్తం రూ.2.15 లక్షల చెక్కును మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాజకుమారి జగదీష్ తల్లిదండ్రులు సింహాచలం, రమణమ్మలకు అందజేశారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ కేజీ రావు (రిటైర్డు), హెచ్సీ శ్రీరామమూర్తి, పీసీలు సంతోష్కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.