టీడీపీ నేతల గృహనిర్బంధం
ABN , First Publish Date - 2021-05-25T05:17:38+05:30 IST
టీడీపీ అధిష్ఠానం పిలుపు మేరకు కరోనా బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు ఆసుపత్రు లను బయల్దేరిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. గృహ నిర్బంధం చేయడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము ఇక్కడకు వచ్చినట్టు పోలీసులు స్పష్టం చేశారు.

విజయనగరం రూరల్, మే 24: టీడీపీ అధిష్ఠానం పిలుపు మేరకు కరోనా బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు ఆసుపత్రు లను బయల్దేరిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. గృహ నిర్బంధం చేయడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము ఇక్కడకు వచ్చినట్టు పోలీసులు స్పష్టం చేశారు. కాగా జిల్లా కేంద్రాసుపత్రికి వెళ్లేందుకు సోమవారం మాజీ ఎమ్మెల్యే డాక్టరు కేఏ నాయుడు సిద్ధమవగా, అప్పటికే పోలీసులు వచ్చి ఆయన ఇంటి ముందు ఉన్నారు. ఈ సందర్భంగా కేఏ నాయుడు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రాసుపత్రికి వెళితే, తప్పా.. అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రకటనలకి క్షేత్రస్థాయిలో పరిస్థితికి చాలా తేడా కనిపిస్తుందన్నారు. రాష్ట్ర మంత్రులు ఎక్కడున్నారో? తెలియడం లేదన్నారు. మంత్రి బొత్స జిల్లా కేంద్రాసుపత్రితో పాటు, కరోనా ఆసుపత్రులను సందర్శిస్తే, పరిస్థితి ఏమిటో తెలుస్తుందని తెలిపారు.
అడ్డుకోవడం.. అప్రజాస్వామికం..
నెల్లిమర్ల : కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించేందుకు బయల్దేరిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సువ్వాడ రవిశేఖర్ను స్వగ్రామం బొడ్డపేటలో నెల్లిమర్ల పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రవిశేఖర్ మాట్లాడుతూ... కొవిడ్ ఆసుపత్రుల పరిశీలనకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని అన్నారు. పార్టీ మండల నాయకుడు గేదెల రాజారావు, ఎస్సీ సెల్ నాయకుడు పోతల రాజప్పన్నను రాజారావు స్వగ్రామం దన్నానపేటలో హౌస్ అరెస్టు చేశారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
సర్కారే కారణం..
డెంకాడ: నెల్లిమర్ల మిమ్స్ ఆసుపత్రిలో కొవిడ్ బాధితులకు అందుకున్న వైద్యసేవలను తెలుసుకునేందుకు బయల్దేరిన మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్రావును డెంకాడ పోలీసులు గృహనిర్బంధం చేశారు. సాయంత్రం వరకు ఎటూ కదలకుండా చేశారు. మానవతా దృక్పథంతో కొవిడ్ బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న తమను ఇలా గృహ నిర్బంధం చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కరోనా విజృంభణకు ప్రభుత్వమే కారణమవుతుందని ఆరోపించారు.
ప్రజలను కాపాడండి
సాలూరు : కరోనా మహమ్మారి నుంచి ప్రజల ను కాపాడాలని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి ప్రభుత్వా న్ని కోరారు. రోజురోజుకూ కొవిడ్ బాధి తుల సంఖ్య పెరుగుతున్నా.. ముఖ్యమంత్రి జగన్ వారిని ఒక్కసారి కూడా పరామర్శించలేదన్నారు. బాధితు లను పరామర్శిస్తే మానసికంగా వారిలో ధైర్యం పెంపొందుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష పార్టీలను కూడా వెళ్లనీయకుండా ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వేయించాలని కోరారు. వ్యాక్సిన్కు డబ్బులు లేకపోతే ప్రజలే భరించేందుకు సిద్ధంగా ఉన్నా రన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని కోరారు.