రెవెన్యూ శాఖలో కలవరం
ABN , First Publish Date - 2021-05-09T04:51:04+05:30 IST
రెవెన్యూ ఉద్యోగులపై కొవిడ్ తీవ్ర ప్రభావం చూపుతోంది. 18 గంటల వ్యవధిలో ఇద్దరు ఆఫీసు సబార్డినేట్లు(ఓఎస్)మృతి చెందడంతో ఆ శాఖకు చెందిన ఉద్యోగులు విధులు నిర్వహించడానికి భయపడుతున్నారు. తాము ప్రసుత్త పరిస్థితిలో విధులు నిర్వహించలేమని కలెక్టరేట్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఆ శాఖ ఉన్నత అధికారి దృష్టికి తీసుకువెళ్లారు.

18 గంటల్లో ఇద్దరు ఉద్యోగులు మృతి
కలెక్టరేట్/ మెరకముడిదాం, మే 8: రెవెన్యూ ఉద్యోగులపై కొవిడ్ తీవ్ర ప్రభావం చూపుతోంది. 18 గంటల వ్యవధిలో ఇద్దరు ఆఫీసు సబార్డినేట్లు(ఓఎస్)మృతి చెందడంతో ఆ శాఖకు చెందిన ఉద్యోగులు విధులు నిర్వహించడానికి భయపడుతున్నారు. తాము ప్రసుత్త పరిస్థితిలో విధులు నిర్వహించలేమని కలెక్టరేట్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఆ శాఖ ఉన్నత అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టరేట్లో పనిచేస్తున్న ఆఫీసు సబార్డునేట్ సీతారామ శాస్త్రి కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతూ ఈనెల 7 ఉదయం తుది శ్వాస విడిచారు. ఇదే సెక్షన్లో పని చేస్తున్న అహమ్మద్ కరోనాతో శనివారం మృతి చెందారు. కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పిలిచే ఇద్దరు ఓఎస్లు మృతి చెందడంతో ఆ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులంతా విధులే నిర్వహించడానికి హడలి పోతున్నారు. ఇప్పటికే ఇదే శాఖలో పనిచేస్తున్న సెక్షన్ సూపరింటెండెంట్లకు కరోనా లక్షణాలు ఉండటంతో ఆసుపత్రుల్లోనూ, హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. కర్ఫ్యూ నేపఽథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ప్రభుత్వ కార్యాలయాల పని వేళలు మార్పు చేస్తున్నట్లు పేర్కొంది. కానీ కొంతకాలం పాటు విధులకు 50 శాతం ఉద్యోగులే వచ్చే విధంగా అవకాశం కల్పించాలని ఉద్యోగుల సంఘం నాయకులు కోరుతున్నారు.
కరోనాకు ఇద్దరు ఉద్యోగుల బలి
మెరకముడిదాం మండలంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు శనివారం కరోనా బారిన పడి మృతిచెందారు. వైద్యశాఖలో గర్భాం పీహెచ్సీలో ఎంపీహెచ్ఈవోగా పనిచేసిన వ్యక్తితో పాటు మండల విద్యాశాఖలో గర్భాం క్లస్టర్లో సీఆర్పీగా పనిచేస్తున్న మరో ఉద్యోగి మరణించారు. మండలంలో పనిచేసిన ఇద్దరు ఉద్యోగులు ఒకేరోజు మృతిచెందడం అందరినీ కలచివేసింది. ఇద్దరూ ఆదర్శంగా సేవలు అందించారని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు.