పురిటిపెంటలో డెంగ్యూ కలకలం
ABN , First Publish Date - 2021-05-13T05:10:38+05:30 IST
పురిటిపెంటలో డెంగ్యూ కలకలం
పెరిగిన పందుల సంచారం
ఆందోళనలో గ్రామస్థులు
గజపతినగరం : మండలంలోని పురిటి పెంట న్యూకాలనీలో డెంగ్యూ కలకలం సృష్టిస్తుంది. కొద్ది రోజులుగా జర్వంతో బాధపడుతున్న కొందరు ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ లక్షణాలు ఉన్నట్టు నిర్థారణ అయిందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా పందుల సంచారంతోనే ఈ వ్యాధి ప్రబలుతుందని స్థానికులు వాపోతున్నారు. గత నెలలో ఇదే కాలనీలో ఇద్దరికి డెంగ్యూ లక్షణా లు కనిపించగా విశాఖలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. ప్రస్తుతం మరికొంత మందికి ఈ వ్యాధి లక్షణాలు బయటపడడంతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తుంటే మరో వైపు డెంగ్యూ ప్రబలుతుండడంతో కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పారిశుధ్య పనులతోపాటు పందుల సంచారాన్ని నివారించాలని కాలనీవాసులు కోరుతున్నారు.