కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-03-23T05:14:32+05:30 IST

జిల్లాలో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. కొద్దినెలలుగా కేసులు తగ్గుముఖం పట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మరోసారి కలకలం రేగింది. జిల్లాలోని దత్తిరాజేరు మండలంలో మొదటి మరణం నమోదైంది. ఇప్పటికే కరోనా సెకెండ్‌ వేవ్‌ ఉందని వైద్యులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మృతి కేసు నమోదుకావడం కలవరం కలిగిస్తోంది.

కరోనా కలకలం

దత్తిరాజేరు మండలంలో వృద్ధుడు మృతి 

దత్తిరాజేరు/ రామభద్రపురం/ కలెక్టరేట్‌, మార్చి 22: జిల్లాలో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. కొద్దినెలలుగా కేసులు తగ్గుముఖం   పట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మరోసారి కలకలం రేగింది. జిల్లాలోని దత్తిరాజేరు మండలంలో మొదటి మరణం నమోదైంది. ఇప్పటికే కరోనా సెకెండ్‌ వేవ్‌ ఉందని వైద్యులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మృతి కేసు నమోదుకావడం కలవరం కలిగిస్తోంది. కేసులు కూడా ఇటీవల కాలంలో పెరుగుతూ వస్తున్నాయి. గత ఏడాదిలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు. ప్రస్తుతం బాధితులుగా ఉన్నవారికి హోమ్‌ క్వారంటైన్‌లో చికిత్స అందజేస్తున్నారు. దత్తిరాజేరు మండలంలోని ఓ గ్రామంలో కరోనా వైరస్‌తో వృద్ధుడు సోమవారం మృతిచెందినటు పీహెచ్‌సీ వైద్యాధికారి ఆర్‌.ఆనంద్‌కుమార్‌ ధ్రువీకరించారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. మృతి కేసు వచ్చిన గ్రామంలో బ్లీచింగ్‌తో పాటు పారిశుధ్య పనులు చేపట్టేలా అధికారులు ఆదేశించారు. 

పాఠశాల విద్యార్థినిలో కరోనా లక్షణాలు 

రామభద్రపురం మండలంలోని ఓ పంచాయతీలో కరోనా కలకలం రేగింది. గ్రామంలో ఉన్న హైస్కూల్‌లో ఓ విద్యార్థినికి మూడు రోజుల కిందట కరోనా పరీక్షలు చేశారు. వైరస్‌ లక్షణాలు బయటపడడంతో గ్రామంలోనే హోం ఐసోలేషన్‌లో ఉంచి ఆరికతోట పీహెచ్‌సీ వైద్య సిబ్బంది మందులు అందిస్తున్నారు. 

అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌పై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ సూచించారు. తన చాంబర్‌లో  సోమవారం సాయంత్రం కొవిడ్‌ జిల్లా టాస్క్‌ఫోర్సు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకూ 40 పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, ఇవి పెరగకుండా చూడాలని చెప్పారు. కేసులు పెరిగితే మరోసారి లాక్‌డౌన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. పాఠశాలల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అన్ని విద్యా సంస్థలూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకూ 74 వేల మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేశామని చెప్పారు.


Updated Date - 2021-03-23T05:14:32+05:30 IST