పడ కేసిన సాధారణ వైద్యం

ABN , First Publish Date - 2021-05-21T05:07:56+05:30 IST

కరోనా కాలంలో సాధారణ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొందరు ప్రాణాపాయాన్ని ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రులకు వెళ్లాల్సిన వారు.. అత్యవసర పరీక్షలకు ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన వారు నరకం చూస్తున్నారు. ఇంటి వైద్యమే పొందుతూ దేవుడిపై భారం వేస్తున్నారు.

పడ కేసిన సాధారణ వైద్యం

ఇతర జిల్లాలకు పరీక్షలకు వెళ్లాలంటే నరకమే

ఇంటి వైద్యమే గతి అంటున్న రోగులు

గజపతినగరం, మే 20: కరోనా కాలంలో సాధారణ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొందరు ప్రాణాపాయాన్ని ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రులకు వెళ్లాల్సిన వారు.. అత్యవసర పరీక్షలకు ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన వారు నరకం చూస్తున్నారు. ఇంటి వైద్యమే పొందుతూ దేవుడిపై భారం వేస్తున్నారు. సాధారణ జబ్బులతో ఉన్న రోగులకు కరోనా నిబంధనలు కఠినంగా ఉన్నాయి. బీపీ, షుగర్‌ ఉన్నవారు ఇతర రోగాలతో బాధ పడితే కనుక ప్రతినెలా లేదా 15రోజులకో విశాఖలోని వివిధ వైద్యశాలల్లో పరీక్షలు.. చికిత్సలు చేయించుకోవడం తప్పనిసరి. గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, మతిస్థిమితం లేనివారు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు క్రమ పద్ధతిలో పరీక్షలు చేయించుకున్న వీరికి కొత్త ఆటంకం వచ్చి పడింది. జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లాలంటే కొవిడ్‌ నిబంధనలు పాటించాలి. నిర్ణయించిన సమయంలోనే బయటకు వెళ్లాలి. వ్యయపయాసలకు ఓర్చి వెళ్లినా అక్కడ డాక్టర్‌ ఉంటారో.. లేదో తెలియదు. ఓపీ చూస్తారన్న భరోసా లేదు. అక్కడ ఆలస్యమైతే ఇంటికి చేరడానికి వాహనాలు ఉండవు. దీంతో రోగులు తీవ్ర ఇక్కట్లకు గురవుతన్నారు. జిల్లాలో బీపీ, షుగర్‌ రోగులు సుమారు లక్షా 80వేల మంది వరకు ఉన్నారు. వీరిలో చాలా మంది ఇతర వ్యాఽధి నిర్థారణ పరీక్షల కోసం విశాఖకు వెళుతుంటారు. ఇప్పుడు వీరికి అనారోగ్యం ముంచుకొచ్చినా బయటకు వెళ్లే పరిస్థితులు లేవు. తమ ప్రాంతంలోనే కదలలేని స్థితిలో... ఇక పొరుగు జిల్లాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే కత్తి మీద సామేనని గజపతినగరానికి చెందిన సుగర్‌ బాధితుడు రామారావు ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో విశాఖ నుంచి ప్రముఖ వైద్యులు కొందరు వారంలో కొన్ని రోజుల్లో జిల్లాకు రావడంతో రోగులు ఇక్కడే చూపించుకునేవారు. కర్ఫ్యూ నేపథ్యంలో అక్కడి నుంచి వైద్యులు రాకపోవడంతో ఫోన్‌లద్వారా రోగి తమ కష్టాలను తెలియజేస్తున్నారు. అటు నుంచి కొందరు వైద్యులు ఏవో సలహాలు ఇస్తున్నారు. ఇంకొందరు మాత్రం గతంలో ఇచ్చిన మందులనే కొనసాగించాలని సూచిస్తున్నారు. దీంతో ఎటునుంచి ఏ ప్రమాదం సంభవిస్తుందోనని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-05-21T05:07:56+05:30 IST