‘పంచాయతీ’కి బ్రేక్!
ABN , First Publish Date - 2021-01-12T05:50:14+05:30 IST
పంచాయతీ ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

ఊపిరి పీల్చుకుంటున్న అధికారులు.. ప్రజా ప్రతినిధులు
సంక్షేమ పథకాల పంపిణీకి తొలగిన అడ్డంకులు
పంచాయతీ
ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. నాలుగు రోజులుగా నెలకొన్న
ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల కమిషన్ షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచీ ఓవైపు
ఎన్నికల సందడి...మరోవైపు పండగ హడావుడి తో గ్రామాల్లో వాతావరణం
వేడెక్కింది. రాజకీయ సమావేశాలు మొదలయ్యాయి. సమీకరణాలపై చర్చలు సాగాయి.
ఆశావహులు పోటీకి గల అవకాశాలపై సన్నిహితులతో చర్చిస్తున్నారు. మరోవైపు అంతా
కోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. షెడ్యూలును రద్దు చేస్తూ
కోర్టు తీర్పునివ్వడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
ఆశావహులకు నిరాశ
ఇదిలా ఉండగా ఎన్నికల షెడ్యూలు ప్రకటనతో రాజకీయ నాయకుల్లో కదలిక వచ్చింది. ఇప్పటికే పోటీకి సిద్ధపడిన వారు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఓవైపు కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తూనే.. మరోవైపు గ్రామాల్లో తమ అనుయాయులతో ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఇటు పండగ సందడి...అటు ఎన్నికల హడావుడి మొదలైంది. కోర్టు తీర్పును అనుసరించి ముందుకు వెళ్లాలని అధికశాతం ఆలోచించారు. ఈమేరకు షెడ్యూలుకు కోర్టుకు బ్రేకు వేయడంతో ఆశావహులు నిరాశకు గురవుతున్నారు.