విజయనగరం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం
ABN , First Publish Date - 2021-05-25T05:12:35+05:30 IST
బ్లాక్ ఫంగస్ వ్యాధితో జిల్లాకు చెందిన ఓ వ్యక్తి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు.

రింగురోడ్డు : బ్లాక్ ఫంగస్ వ్యాధితో జిల్లాకు చెందిన ఓ వ్యక్తి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. దీంతో జిల్లాలో కలకలం రేగింది. డెంకాడ మండలం బొడ్డవలస గ్రామానికి చెందిన అతడు చిరువ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తుండేవారు. కొద్దిరోజుల కిందట కొవిడ్ బారిన పడి చికిత్స కోసం విజయనగరంలో పలు ఆసుపత్రులకు వెళ్లాడు. బెడ్లు ఖాళీ లేకపోవడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అయితే పరిస్థితి విషమించడంతో ఈ నెల 20న ఆయన్ని కేజీహెచ్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా సోమవారం బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడి మృతి చెందారు. ఈ విషయంపై ‘ఆంధ్రజ్యోతి’ డీఎంహెచ్వో రమణకుమారిని వివరణ కోరగా సదరు వ్యక్తి కొవిడ్ బారిన పడి బ్లాక్ ఫంగస్ వ్యాధితోనే మరణించినట్లు తెలిపారు. జిల్లాలో ఇదే మొదటి కేసు అని ఆమె స్పష్టం చేశారు.