కన్నుమూసి తెరిచేలోగా...
ABN , First Publish Date - 2021-06-24T05:01:27+05:30 IST
వేర్వేరు గ్రామాలకు చెందిన ఆ ఇద్దరు యువకులదీ దాదాపు ఒకే నేపథ్యం. ఇద్దరూ తండ్రులను కోల్పోయిన వారే. తల్లి, తోబుట్టువులకు వారే పెద్దదిక్కు. ఒకరు ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతుండగా... ఇంకొకరు ఉద్యోగానికి ఎంపికయ్యారు. వారిపై ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతున్న ఆ కుటుంబాలపై విధి కన్నెర్ర చేసింది.
రెండు కుటుంబాల్లో విషాదం
బైకులు ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం
రామభద్రపురం, జూన్ 23: వేర్వేరు గ్రామాలకు చెందిన ఆ ఇద్దరు యువకులదీ దాదాపు ఒకే నేపథ్యం. ఇద్దరూ తండ్రులను కోల్పోయిన వారే. తల్లి, తోబుట్టువులకు వారే పెద్దదిక్కు. ఒకరు ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతుండగా... ఇంకొకరు ఉద్యోగానికి ఎంపికయ్యారు. వారిపై ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతున్న ఆ కుటుంబాలపై విధి కన్నెర్ర చేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఇద్దరు యువకులను పొట్టన పెట్టుకుంది. ఇదీ ఇరగవరపు లక్ష్మీతేజ (22), బండి వంశీకృష్ణ(24)ల విషాదాంతం. రామభద్రపురం మండల కేంద్రంలోని రాజాం రోడ్డు సమీపంలో చర్చి సెంటర్ వద్ద బుధవారం మోటార్సైకిళ్లు ఢీకొని ఇద్దరూ దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామభద్రపురానికి చెందిన ఇరగవరపు లక్ష్మీతేజ (22) పౌరోహిత్యం చేస్తుంటాడు. ఇదే పనిపై బాడంగి వెళ్లి తిరిగి బైక్పై బుధవారం రామభద్రపురం వస్తున్నాడు. బాడంగి మండలం గజరాయనివలస గ్రామానికి చెందిన బండి వంశీకృష్ణ(24) రామభద్రపురం నుంచి మోటార్ సైకిల్పై స్వగ్రామానికి వస్తున్నాడు. వీరిద్దరూ ఎదురెదురుగా వస్తూ రామభద్రపురం చర్చి సెంటర్ వద్ద ఒకరినొకరు ఢీకొన్నారు. ఘటనా స్థలంలోనే లక్ష్మీతేజ మృతిచెందాడు. తీవ్ర గాయాలై కొనఊపిరితో ఉన్న వంశీకృష్ణను విజయనగరం ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం బాడంగి సీహెచ్సీకి తరలించారు. ప్రమాదంలో రెండు ద్విచక్ర ాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బండి వంశీకృష్ణ సొంత ఊరు పాచిపెంట గ్రామం కాగా బాల్యంలోనే అతని తండ్రి చనిపోవడంతో తాతగారైన కందుల ధర్మరాజు ఇంటి వద్ద ఉండి విద్యాభ్యాసం పూర్తిచేశాడు. విశాఖ పట్టణంలో చార్టెడ్ అకౌంటెంట్ కోర్సులో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతనికి తల్లి గీత, చెల్లి ఉన్నారు. త్వరలోనే ఉద్యోగంలో చేరి అండగా ఉంటాడనుకుంటున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో వంశీకృష్ణ మృతిచెందడాన్ని తల్లి, చెల్లెలు జీర్ణించుకోలేకపోతున్నారు.
లక్ష్మీతేజ పౌరోహిత్యంలో చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. అతని తండ్రి కూడా పదేళ్ల కిందట చనిపోవడంతో శ్రీరాంనగర్ కాలనీలో తాతగారింటివద్ద ఉంటూ పౌరోహిత్యం చేస్తున్నాడు. అతనికి తల్లి శుభ, ఒక అక్క ఉన్నారు. పెద్ద దిక్కుగా ఉన్న యువకులు మృతిచెందడంతో ఇరు కుటుంబాలు గుండెలవిసేలా విలపిస్తున్నాయి.