సచివాలయాలకు నిధులేవి?
ABN , First Publish Date - 2021-11-22T04:11:39+05:30 IST
గ్రామ సచివాలయాలకు ప్రత్యేక నిధులు మంజూరుకాక ఏ ఒక్క స్టేషనరీ కొనుగోలు చేయాలన్నా సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సచివాలయాల వ్యవస్థ ప్రారంభం తరువాత జిల్లా కేంద్రం ద్వారా కుర్చీలు, టేబుళ్లు, ప్రింటర్, రికార్డుల నిర్వహణకు సంబంధించిన పుస్తకాలు తదితర వాటిని మాత్రమే పంపించారు. స్టేషనరీ కొనుగోలుకు సంబంధించి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయని పరిస్థితి జిల్లాలో ఉంది.

స్టేషనరీ కొనుగోలుకు అవస్థలు
పంచాయతీ అకౌంట్ నుంచి ఖర్చు చేస్తే ఆడిట్ అభ్యంతరాలు
సొంత సొమ్ము వదిలించుకుంటున్న సిబ్బంది
(పార్వతీపురం)
గ్రామ సచివాలయాలకు ప్రత్యేక నిధులు మంజూరుకాక ఏ ఒక్క స్టేషనరీ కొనుగోలు చేయాలన్నా సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సచివాలయాల వ్యవస్థ ప్రారంభం తరువాత జిల్లా కేంద్రం ద్వారా కుర్చీలు, టేబుళ్లు, ప్రింటర్, రికార్డుల నిర్వహణకు సంబంధించిన పుస్తకాలు తదితర వాటిని మాత్రమే పంపించారు. స్టేషనరీ కొనుగోలుకు సంబంధించి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయని పరిస్థితి జిల్లాలో ఉంది. సచివాలయాలకు డీడీవోగా ఉన్న గ్రామ కార్యదర్శులే పంచాయతీలకు మంజూరైన అభివృద్ధి నిధుల నుంచి కొంతమేర ఖర్చు చేస్తుంటారు. ఒక్కో పంచాయతీ నుంచి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ప్రతి నెలలో ఉంటుంది. ఈ నిధులు పంచాయతీల నుంచి తీసి ఉపయోగిస్తే ఏడాదికి ఒకసారి జరిగే ఆడిట్లో అధికారులు అభ్యంతరం చెబుతున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్లో పంచాయతీల నిధుల నుంచి గ్రామ సచివాలయాల నిర్వహణకు నిధులు ఉపయోగించకూడదని స్పష్టం చేశారు. దీంతో గ్రామ సచివాలయాల్లో స్టేషనరీ కోసం సిబ్బంది అత్యవసర పరిస్థితిలో సొంత సొమ్ము ఖర్చుచేస్తున్నారు.
పర్యవేక్షణ ఫుల్.. నిధులు నిల్
మండల స్థాయి అధికారి నుంచి జిల్లా కలెక్టర్ వరకు గ్రామ సచివాలయాల పనితీరుపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సేవల గురించి ఆరా తీసే అధికారులు ఇక్కడున్న కనీస సమస్యలను పరిష్కరించడం లేదు. సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మాటవరుసకైనా అడిగిన సందర్భాలు లేవన్నది ఉద్యోగుల ఆవేదన. సమయానికి సిబ్బంది రాలేదని, సేవలు సక్రమంగా ప్రజలకు అందించడం లేదని ఉన్నతాధికారులు సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం తరచూ చూస్తున్నాం. ఇదే సమయంలో అక్కడి నిధుల సమస్యపైనా దృష్టిసారించాల్సి ఉంది.