అధికారుల అండ... ఇసుక అక్రమ దందా
ABN , First Publish Date - 2021-10-30T05:24:39+05:30 IST
అధికారుల అండతో ఇసుక అక్రమ రవాణాను అధికారపార్టీ నాయకులు చేసుకుంటున్నారు.
పరిగి, అక్టోబరు 29: అధికారుల అండతో ఇసుక అక్రమ రవాణాను అధికారపార్టీ నాయకులు చేసుకుంటున్నారు. పరిగి మండల కొడిగెనహళ్లి పంచాయతీ కార్యదర్శి అండదండలతో శుక్రవారం హిందూపురంలో భవన నిర్మాణం కోసం ఏడు ట్రాక్టర్ల ఇసుక కోసం అనుమతినిచ్చారు. అయితే పరిగి మండలం బిందునగర్కు సుమారు 20 ట్రాక్టర్ల దాకా ఇసుకను డంప్ చేసి ఉంచారు. అధికార పార్టీ నాయకులు కావడంతో వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతినిత్యం పంచాయతీ కార్యదర్శి ఆయనకు ఇష్టం వచ్చినట్లు అనుమతులు ఇవ్వడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మామూళ్లు ఇచ్చుకున్నవారికి మాత్రమే మంజూరు పత్రాలను అందజేస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. ఎడ్లబండ్లపై సొంత భవనాలకు ఇసుకను తీసుకొస్తుంటే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటారని, ట్రాక్టర్ల యజమానులపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కాగా ఇసుక అక్రమ తరలింపు విషయంపై ఎనఫోర్స్మెంట్ అధికారి లక్ష్మీదుర్గయ్యను వివరణ కోరగా అక్రమంగా ఇసుకను తరలించింది వాస్తవమేనన్నారు. ఈ ఘటనపై పంచాయతీ కార్యదర్శికి నోటీసులు జారీ చేస్తామన్నారు. అదేవిధంగా అక్రమంగా తరలించిన ఇసుకను సీజ్ చేస్తామని తెలిపారు.
