టీటీడీ ఆధ్వర్యంలో 20 ఆలయాలు
ABN , First Publish Date - 2021-08-10T05:14:40+05:30 IST
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 20 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు దేవదాయ శాఖ ఏసీ వినోద్ తెలిపారు.
ఒక్కోదానికి రూ.10 లక్షలు
త్వరలో పనులు ప్రారంభం
దేవదాయ శాఖ ఏసీ వినోద్
విజయనగరం రూరల్, ఆగస్టుత 9: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 20 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు దేవదాయ శాఖ ఏసీ వినోద్ తెలిపారు. విజయనగరంలోని దేవదాయశాఖ కార్యాలయం వద్ద సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక్కో ఆలయానికి రూ.10 లక్షల చొప్పున టీటీడీ విడుదల చేస్తోందని వెల్లడించారు. దేవదాయశాఖ ఇంజనీర్లు, అధికారుల పర్యవేక్షణలో ఈ నెలాఖరు నుంచి వీటి నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించామని, గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఐదు నుంచి పది సెంట్ల భూమిని సేకరిస్తున్నామని చెప్పారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి టీటీడీ ప్రత్యేక నమునా విడుదల చేసిందన్నారు. ఆ ప్రకారమే నిర్మాణాలు జరుగుతాయని తెలిపారు. నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు టీటీడీ కూడా ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందాన్ని పంపుతుందని చెప్పారు. రెండో దశలో మరిన్ని ఆలయాల నిర్మాణానికి కృషి చేయనున్నట్టు తెలిపారు.
దూపదీప నైవేద్యం కింద 63 దేవాలయాలు
దూపదీప నైవేద్యం కింద జిల్లాలో ప్రస్తుతం 63 దేవాలయాలు ఉన్నాయని, తాజాగా మరో 20 దర ఖాస్తులు వచ్చాయని ఏసీ వినోద్ తెలిపారు. వీటిని దేవదాయశాఖకు పంపామని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చిన వెంటనే సంబంధిత దరఖాస్తుదారులకు సమాచారం ఇవ్వనున్నట్టు చెప్పారు.
==================