జూకి 33 కొత్త జంతువులు, పక్షులు రాక
ABN , First Publish Date - 2021-11-28T06:13:22+05:30 IST
నగరంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు శుక్రవారం రాత్రి న్యూఢిల్లీలోని నేషనల్ జులాజికల్ పార్కు నుంచి జంతు మార్పిడి పద్ధతి ద్వారా 33 జంతువులు, పక్షులను తీసుకువచ్చినట్టు జూ క్యూరేటర్ డాక్టర్ డాక్టర్ నందనీ సలారియా తెలిపారు.

క్వారంటైన్ గడువు ముగిశాక సందర్శకులు తిలకించేందుకు ఏర్పాట్లు
క్యూరేటర్ డాక్టర్ నందనీ సలారియా
ఆరిలోవ, నవంబరు 27: నగరంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు శుక్రవారం రాత్రి న్యూఢిల్లీలోని నేషనల్ జులాజికల్ పార్కు నుంచి జంతు మార్పిడి పద్ధతి ద్వారా 33 జంతువులు, పక్షులను తీసుకువచ్చినట్టు జూ క్యూరేటర్ డాక్టర్ డాక్టర్ నందనీ సలారియా తెలిపారు. న్యూఢిల్లీ జూ నుంచి సంగై డీర్స్ (జింకలు) ఆరు మగ, ఆరు ఆడ, బెంగాల్ నక్క పిల్లలు నాలుగు, నెమోర్హెడస్ గోరల్ ఒక మగ, రెండు ఆడ, కలీజ్ ఫిసెంట్ పక్షులు ఒక మగ, రెండు ఆడ, నీలగై (మనుబోతులు) మగవి రెండు, వైట్ ఐబిస్ (కొంగలు) రెండు ఆడ, రెండు మగ, స్వాంప్ డీర్స్ (చిత్తడి జింకలు) ఒక మగ, ఒక ఆడ ఉన్నాయన్నారు. అలాగే సిల్వర్ ఫిసెంట్స్ (వెండి నెమళ్లు) ఒక మగ, ఒక ఆడ, ఒక నీటి ఏనును (మగది) తీసుకువచ్చినట్టు క్యూరేటర్ పేర్కొన్నారు. వీటికి బదులుగా ఇక్కడి జూ నుంచి రెండు రేసుకుక్కలు (మగ, ఆడ),. ఒక హైనా (మగ), ఒక సెక్రెడ్ బబూన్ (ఆడ కోతి), 15 నక్షత్ర తాబేళ్ల (5మగ, 10 ఆడ)ను ఢిల్లీ జూకి అందించామన్నారు. కొత్తగా జూకి వచ్చిన జంతువులు, పక్షులను క్వారంటైన్లో వుంచామని, ఆ గడువు ముగిశాక సందర్శకులు తిలకించేందుకు వీలుగా ఎన్క్లోజర్లలో పెడతామన్నారు. రానున్న ఫిబ్రవరి నెలలో మరికొన్ని జంతువులు ఇక్కడకు రానున్నట్లు ఆమె తెలిపారు.
