పనివేళలు మార్చాల్సిందే
ABN , First Publish Date - 2021-05-09T04:26:36+05:30 IST
రాష్ట్రంలో అమలవుతున్న కర్ఫ్యూకు తగ్గట్టుగా పనివేళలను మార్చాల్సిందేనని హెచ్పీసీఎల్ కార్మికులు డిమాండ్ చేశారు. కొవిడ్ విజృంభిస్తున్నా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనులు చేపట్టాలని యాజమాన్యం నిర్దేశించడం దారుణమంటూ శనివారం ఉదయం వేలాదిమంది కార్మికులు ప్రధాన గేటు వద్ద ఆందోళనకు దిగారు.

హెచ్పీసీఎల్ యజమాన్యం వైఖరిపై కార్మికుల అసంతృప్తి
మల్కాపురం, మే 8: రాష్ట్రంలో అమలవుతున్న కర్ఫ్యూకు తగ్గట్టుగా పనివేళలను మార్చాల్సిందేనని హెచ్పీసీఎల్ కార్మికులు డిమాండ్ చేశారు. కొవిడ్ విజృంభిస్తున్నా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనులు చేపట్టాలని యాజమాన్యం నిర్దేశించడం దారుణమంటూ శనివారం ఉదయం వేలాదిమంది కార్మికులు ప్రధాన గేటు వద్ద ఆందోళనకు దిగారు. సుమారు వెయ్యిమంది కార్మికులు విధులను బహిష్కరించి ఇళ్లకు వెళ్లిపోయారు. గురువారం వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే విధుల్లో ఉండేలా అవకాశం కల్పించగా శుక్రవారం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేయాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కార్మికులు పనివేళలను మార్పుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం నుంచి ఉదయం 6 గంటలకే విధులకు చేరుకుంటామని, వేళలు మార్చకుంటే పనిని స్తంభింపజేస్తామని హెచ్చరిస్తున్నారు.