త్రీటౌన్ సీఐ ఈశ్వరరావు సంగతి తేలుస్తాం
ABN , First Publish Date - 2021-11-23T06:31:16+05:30 IST
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంజాయి వుందని సమాచారం వచ్చిందంటూ దౌర్జన్యంగా లోపలకు వచ్చి తనిఖీలు చేసి...తిరిగి సిబ్బందిని బెదిరించిన త్రీటౌన్ సీఐ ఈశ్వరరావు సంగతి తేలుస్తామని మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.
టీడీపీ నేత అయ్యన్న
జేబులో పొట్లాం పెట్టుకుని టీడీపీ కార్యాలయంలోకి వచ్చి గంజాయి కేసు బుక్ చేయాలని చూస్తున్నట్టున్నారని అనుమానం వ్యక్తంచేసిన మాజీ మంత్రి
విశాఖపట్నం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంజాయి వుందని సమాచారం వచ్చిందంటూ దౌర్జన్యంగా లోపలకు వచ్చి తనిఖీలు చేసి...తిరిగి సిబ్బందిని బెదిరించిన త్రీటౌన్ సీఐ ఈశ్వరరావు సంగతి తేలుస్తామని మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ నాయకుల నుంచి కార్యకర్తల వరకూ ప్రతి ఒక్కరికీ తమ ప్రియతమ నేత నందమూరి తారకరామారావు విగ్రహం వున్న ఈ కార్యాలయం దేవాలయంతో సమానమన్నారు. అటువంటి కార్యాలయంలో గంజాయి వుందని సమాచారం వచ్చిందని సీఐ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. పోలీస్ అధికారిగా కార్యాలయంలోకి రావాలంటే ముందు సమాచారం ఇవ్వాలన్నారు. జేబులో ఒక పొట్లాం పెట్టుకుని వచ్చి గంజాయి కేసు బుక్ చేయాలని కుట్ర పన్నుతున్నట్టున్నారని అయ్యన్న అనుమానం వ్యక్తంచేశారు. పోలీస్ అధికారిగా ఆయన తన గౌరవం నిలబెట్టుకోవాలన్నారు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు ఈశ్వరరావు వంటి అధికారులను విడిచిపెట్టే ప్రసక్తి లేదని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.
ఏఎంసీ పరిధిలో 330 పోస్టుల భర్తీ
ఏడు ప్రొఫెసర్, ఎనిమిది అసోసియేట్ ప్రొఫెసర్, రెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు సహా నాలుగు పారామెడికల్ పోస్టులు
బోధనాస్పత్రుల్లో స్టాఫ్ నర్సులు, పారా మెడికల్ సిబ్బంది నియామకానికి గ్రీన్సిగ్నల్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
వైద్య, ఆరోగ్య శాఖలో ఏళ్ల తరబడి ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమ వుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కళాశాలలు, బోధనాస్పత్రుల్లో 2,190 ఖాళీలను భర్తీ చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఆంధ్ర మెడికల్ కళాశాలతోపాటు పలు బోధనాస్పత్రుల్లో 330 మంది సిబ్బంది నియమితులు కానున్నారు. ఆంధ్రా మెడికల్ కళాశాలకు సంబంధించి ఏడు ప్రొఫెసర్, ఎనిమిది అసోసియేట్ ప్రొఫెసర్, రెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే, మరో నాలుగు పారామెడికల్ పోస్టులు భర్తీకానున్నాయి. కేజీహెచ్లో 120 స్టాఫ్ నర్సు, 82 పారా మెడికల్ పోస్టులను, ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు ఆస్పత్రిలో ఐదు స్టాఫ్ నర్సు, మూడు పారా మెడికల్ పోస్టులు, ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో ఐదు స్టాఫ్ నర్సు, నాలుగు పారామెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాణిచంద్రమతిదేవి ఆస్పత్రిలో ఐదు స్టాఫ్ నర్స్, ఆరు పారామెడికల్, ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రిలో 20 స్టాఫ్ నర్సు, ఆరు పారామెడికల్, విక్టోరియా జార్జ్ ఆస్పత్రిలో 20 స్టాఫ్ నర్సు, 16 పారామెడికల్ సిబ్బంది, ప్రభుత్వ మానసిక వైద్యశాలలో పది స్టాఫ్ నర్సు, ఆరు పారామెడికల్ సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీతో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశముంటుందని ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్ తెలిపారు.