‘పేట’లో పెరిగిన పందుల సంచారం!
ABN , First Publish Date - 2021-07-28T05:56:02+05:30 IST
రెండు వారాల్లో పందులను పట్టణం నుంచి దూరంగా తరలించుకు పోతామని చెప్పిన పెంపకందారులు గడువు దాటినా ఉలుకూ పలుకూ లేదు.
పదిహేను రోజుల్లో దూరంగా తరలిస్తామని చెప్పిన పెంపకందారులు
గడువు ముగిసినా ఉలుకూ.. పలుకూ కరువు
తాజాగా నెలాఖరు వరకు సమయం కోరడంతో అంగీకరించిన పంచాయతీ
పాయకరావుపేట, జూలై 27 : రెండు వారాల్లో పందులను పట్టణం నుంచి దూరంగా తరలించుకు పోతామని చెప్పిన పెంపకందారులు గడువు దాటినా ఉలుకూ పలుకూ లేదు. దీంతో వీటి సంచారం మరింత అధికమైంది. పందుల నియంత్రణకు పంచాయతీ అధి కారులు చర్యలు చేపడుతున్న ప్రతిసారీ కొన్నాళ్ల పాటు వాటి జాడ కానరాదు. ఆ కొద్ది రోజుల తరువాత మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుంది. ఈ వ్యవహారాన్ని సీరి యస్గా తీసుకున్న ఎమ్మెల్యే గొల్ల బాబూరావు హెచ్చరిం చడంతో ఈ నెల ప్రారంభంలో పట్టణంలో పందులను పట్టుకునేందుకు పంచాయతీ అధికారులు ఇతర ప్రాం తాలకు చెందిన వ్యక్తులను తీసుకు వచ్చారు. వారు పం దులను పడుతున్న సమయంలో పందుల పెంపకం దారులు ఘర్షణకు దిగి, దాడిచేసిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పంచాయతీ సర్పంచ్, అధికా రులు ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. పదిహేను రోజుల్లో పందులను పట్టణానికి దూరంగా తరలించుకు పోయేలా పందుల పెంపకందారులను ఒప్పించారు. గడువు దాటిపోయినా పందుల సంచారం తగ్గలేదు. కొద్ది రోజుల క్రితం పంచాయతీ ఇచ్చిన నోటీసులను పందుల పెంపకందారులు తీసుకోలేదని తెలుస్తోంది. దీనిపై పంచాయతీ ఈవో ఎం.సత్యప్రసాద్ను వివరణ కోరగా, పెంపకందారులు పందులను పట్టణం నుంచి తరలించుకుపోయేందుకు ఈ నెలాఖరు వరకు గడువు కోరడంతో అంగీకరించామన్నారు. ఈసారి గడువు ముగిసిన తరువాత కూడా పట్టణంలో పందుల సంచారం తగ్గకుంటే నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టడంతో పాటు పెంపకందారులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.