స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ దుర్మార్గం
ABN , First Publish Date - 2021-04-24T05:16:43+05:30 IST
నాటి పాలకులు క్రమశిక్షణతో ప్రభుత్వ రంగాలను కాపాడుకుంటూ ప్రజలకు సంక్షేమ పాలనను అందిస్తే, నేటి పాలకులు ఉక్కు కర్మాగారం వంటి సంస్థలను విక్రయించాలని యోచించడం దుర్మార్గమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడు వరసాల శ్రీనివాసరావు వివరించారు.
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడు వరసాల శ్రీనివాసరావు
71వ రోజు కొనసాగిన ఉక్కు ఉద్యోగుల దీక్షలు
కూర్మన్నపాలెం, ఏప్రిల్ 23: నాటి పాలకులు క్రమశిక్షణతో ప్రభుత్వ రంగాలను కాపాడుకుంటూ ప్రజలకు సంక్షేమ పాలనను అందిస్తే, నేటి పాలకులు ఉక్కు కర్మాగారం వంటి సంస్థలను విక్రయించాలని యోచించడం దుర్మార్గమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడు వరసాల శ్రీనివాసరావు వివరించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్వహిస్తున్న రిలే దీక్షలు 71వ రోజు కూడా కొనసాగాయి. ఈ దీక్షలలో శుక్రవారం ట్రాఫిక్, కన్స్ట్రక్షన్, డీఅండ్ఈ, సేఫ్టీ, ఎస్టీఈడీ, వర్క్స్ కన్స్ట్రక్షన్ విభాగాలకు చెందిన కార్మికులు కూర్చున్నారు. ఈ శిబిరంలో వరసాల మాట్లాడుతూ విశాఖ కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. జిల్లా టీఎన్టీయూసీ ఇన్చార్జి వి.సత్యనారాయణ మూర్తి యాదవ్ మాట్లాడుతూ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరిగితే దాన్నే నమ్ముకొని బతికే వేలాది కుటుంబాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో కన్వీనర్ గంధం వెంకటరావు మాట్లాడుతూ కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకునివెళ్తున్నట్టు వివరించారు. ఈ దీక్షలలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు బొడ్డు పైడిరాజు, రామన్న, పాపారావు, త్రిమూర్తులు, గురునాథరావు, రెడ్డి, శ్రీనివాస్, రమణ. రామచంద్రరావు, జె.అయోధ్యరామ్, డి.ఆదినారాయణ, గంధం వెంకటరావు, మంత్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.