ఫార్మా బస్సు బోల్తా
ABN , First Publish Date - 2021-04-11T06:24:01+05:30 IST
జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. ఫార్మా కంపెనీకి చెందిన బస్సు అదుపు తప్పి గెడ్డలోకి దూసుకుపోయింది.
డ్రైవర్తోపాలు నలుగురికి గాయాలు
అగనంపూడి, ఏప్రిల్ 10: జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. ఫార్మా కంపెనీకి చెందిన బస్సు అదుపు తప్పి గెడ్డలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా, మరో ముగ్గురు ఫార్మా ఉద్యోగులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.. ఫార్మాసిటీలోని అరబిందో కంపెనీకు చెందిన బస్సు శనివారం రాత్రి జనరల్ షిప్టు డ్యూటీ దిగిన ఉద్యోగులను తీసుకుని గాజువాక బయలుదేరింది. బస్సు సరిగ్గా అగనంపూడి బీసీ కాలనీ వద్దకు వచ్చేసరికి అదుపు తప్పింది. బస్సు వేగానికి గెడ్డలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ జి.సతీశ్కు తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురు ఫార్మా ఉద్యోగులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన డ్రైవర్ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 16 మంది ఉద్యోగులు ఉన్నారు.
రక్షించిన స్థానికులు
బస్సు బోల్తా పడడంతో లోపల చిక్కుకున్న ఉద్యోగులను అగనంపూడి నిర్వాసిత కాలనీకి చెందిన యువకులు రక్షించారు. అద్దాలను తొలగించి లోపల ఉన్న వారిని బయటకు లాగారు. దువ్వాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.