వర్సిటీలకు పటిష్ట ఆర్థిక ప్రణాళిక అవసరం
ABN , First Publish Date - 2021-02-26T06:06:04+05:30 IST
కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని అమలు చేయడంలో విశ్వవిద్యాలయాలు పటిష్టమైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలని, పరిశ్రమలు, పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోవాలని అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) చైర్మన్ అనిల్ సహస్రాబుదే పేర్కొన్నారు.

ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ సహస్రాబుదే
సాగర్నగర్, ఫిబ్రవరి 25: కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని అమలు చేయడంలో విశ్వవిద్యాలయాలు పటిష్టమైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలని, పరిశ్రమలు, పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోవాలని అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) చైర్మన్ అనిల్ సహస్రాబుదే పేర్కొన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అతిఽథ్యంలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) వర్చ్యువల్ విధానంలో నిర్వహిస్తున్న దక్షిణాది రాష్ట్రాల (సౌత్ జోన్) వైస్ చాన్సలర్ల సమావేశాలకు గురువారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విశ్వవిద్యాలయాలు నిధులు కోసం ప్రభుత్వాలపై ఎక్కువగా ఆధారపడకుండా వివిధ మార్గాలను అన్వేషించాలని సూచించారు. గీతం వీసీ కె.శివరామకృష్ణ మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీయనున్నదన్నారు. ఏఐయూ అధ్యక్షుడు డాక్టర్ తేజ్ప్రతాప్, ఉపాధ్యక్షుడు డాక్టర్ తిరువసాగం గణపతి తదితరులు మాట్లాడారు. కేంద్ర విద్యా సంస్థలతో సమానంగా రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించాలని, విద్యాసంస్థలను జీఎస్టీ నుంచి మినహాయించాలని, ప్రైవేటు డీమ్డ్ విశ్వవిద్యాలయాలకు పరిశోధనా నిధులు అందజేయాలని పలువురు వీసీలు సూచించారు.