స్టీల్ప్లాంట్ పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు శరణ్యం
ABN , First Publish Date - 2021-05-09T05:09:52+05:30 IST
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరిగితే దాన్నే నమ్ముకున్న వేలాది కుటుంబాలు ఎలా బతకాలని, కార్మికులు అంతా గొంతెత్తి ఐక్యంగా ఉద్యమించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్ గంధం వెంకటరావు అన్నారు.

పోరాట కమిటీ కో-కన్వీనర్ గంధం వెంకటరావు
కూర్మన్నపాలెం, మే 8: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరిగితే దాన్నే నమ్ముకున్న వేలాది కుటుంబాలు ఎలా బతకాలని, కార్మికులు అంతా గొంతెత్తి ఐక్యంగా ఉద్యమించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్ గంధం వెంకటరావు అన్నారు. కూర్మన్నపాలెంలో విశాఖ ఉక్కు పోరాట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 86వ రోజు కూడా కొనసాగాయి. శనివారం ఈ దీక్షల్లో పాల్గొన్న బీఎఫ్ కార్మికులనుద్దేశించి వెంకటరావు మాట్లాడుతూ కార్మిక పోరాటాలు అణిచివేసేందుకు, సమ్మెలు చేయకుండా, సంఘాలు పెట్టకుండా లేబర్ కోడ్లను మార్పు చేశారన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలనే దురాలోచన చేస్తున్నారన్నారు. ఈఉధ్యమాన్ని ప్రజా ఉద్యమంగా మరల్చాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పోరాట కమిటీ సభ్యుడు యు.రామస్వామి మాట్లాడుతూ దేశంలో అంటురోగాలు వ్యాప్తి చెందినప్పుడు మందులను ప్రభుత్వాలు ఉచితంగా ఇవ్వాలని అన్నారు. విశాఖ ఉక్కుతో పాటు కీలక పరిశ్రమలను విదేశీ కంపెనీలకు కట్టబెట్టడమే దేశభక్తా అని ప్రశ్నించారు. ఈ శిబిరంలో విశాఖ ఉక్కు పోరాట కమిటీ సభ్యుడు వెంకటరావు, రమణ, నగేష్, బాల, రామ కోటేశ్వరరావు, శంకర్, శ్రీనివాసరావు, మహేష్, సన్ని, విజయ్, రాజు, మహదేవ్ తదితరులు పాల్గొన్నారు.