శిల్పారామానికి పర్యాటక కళ!

ABN , First Publish Date - 2021-10-30T04:59:30+05:30 IST

మధురవాడ శిల్పారామానికి మళ్లీ పూర్వ వైభవం రాబోతోంది. రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలు అమలైతే అభివృద్ధితో పాటు పర్యాటకులతో కళకళలాడనుంది. శిల్పారామం అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ రూపొందించి చర్యలు తీసుకుంటామని గత పదేళ్లుగా అధికారులు ప్రకటనలు చేస్తున్నప్పటికీ, నిధుల లేమితో ఒక్క అడుగూ ముందుకు పడలేదు.

శిల్పారామానికి పర్యాటక కళ!
మధురవాడ శిల్పారామం

అభివృద్ధి చేసేందుకు మంత్రి వర్గం నిర్ణయం

పీపీపీ విధానంలో స్టార్‌హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం


మధురవాడ, అక్టోబరు 29: మధురవాడ శిల్పారామానికి మళ్లీ పూర్వ వైభవం రాబోతోంది. రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలు అమలైతే అభివృద్ధితో పాటు పర్యాటకులతో కళకళలాడనుంది. శిల్పారామం అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ రూపొందించి చర్యలు తీసుకుంటామని గత పదేళ్లుగా అధికారులు ప్రకటనలు చేస్తున్నప్పటికీ, నిధుల లేమితో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దీంతో పట్టణంలో పల్లె సంస్కృతిని ప్రతిబింబించే శిల్పారామం వెలవెలపోయింది. తాజాగా మంత్రివర్గ సమావేశంలో పర్యాటక, ఆతిఽథ్య రంగాలకు ఊతమిచ్చేలా నిర్ణయాలు తీసుకోవడంతో శిల్పారామం ప్రాజెక్టుపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.


ఇదీ చరిత్ర..

మధురవాడలో సుమారు 20 ఏళ్ల కిందట 25.53 ఎకరాల విస్తీర్ణంలో శిల్పారామంను వుడా నిర్మించింది. 2006లో ఈ ప్రాజెక్టును ఏపీ టూరిజం శాఖకు అప్పగించింది. రాష్ట్ర విభజనకు ముందు తెలుగు రాష్ట్రాల్లోని శిల్పారామాల నిర్వహణ సక్రమంగా సాగేది. విభజనానంతరం ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఆదాయం కూడా కుంటుపడింది. అయితే తాజా ప్రభుత్వ నిర్ణయాలు అమలైతే శిల్పారామం పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. 


మూడు ఎకరాల్లో స్టార్‌ హోటల్‌

ప్రభుత్వ, ప్రైవేటు (పీపీపీ) భాగస్వామ్య పద్ధతిలో శిల్పారామంలోని మూడెకరాల విస్తీర్ణంలో  200 గదులతో స్టార్‌హోటల్‌ నిర్మించడానికి మంత్రివర్గం ఆమోదించింది. అలాగే 1500 మంది హాజరయ్యేందుకు వీలుగా ఓ కన్వెన్షన్‌ సెంటర్‌ను కూడా నిర్మించనున్నారు. ఈ పనులకు సుమారు రూ.200 కోట్లు ఖర్చవుతుందని అంచనా. హయాత్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్టు సమాచారం. 


Updated Date - 2021-10-30T04:59:30+05:30 IST