అత్యధిక పంచాయతీల్లో గెలుపే లక్ష్యం

ABN , First Publish Date - 2021-02-01T06:36:31+05:30 IST

జిల్లాలో తొలివిడత ఎన్నికల్లో అత్యధిక పంచాయతీల్లో పార్టీ మద్దతుదారులను గెలిపించి టీడీపీ అధినేత చంద్రబాబుకు కానుకగా ఇస్తామని ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్‌ అన్నారు.

అత్యధిక పంచాయతీల్లో గెలుపే లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్‌

 ఈ విజయాలను ‘బాబు’కు కానుకగా ఇస్తాం

రాష్ట్రంలో వైసీపీది అరాచక పాలన 

ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్‌

చోడవరం, జనవరి 31: జిల్లాలో తొలివిడత ఎన్నికల్లో అత్యధిక పంచాయతీల్లో పార్టీ మద్దతుదారులను గెలిపించి టీడీపీ అధినేత చంద్రబాబుకు కానుకగా ఇస్తామని ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్‌ అన్నారు. మండల పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రాజు,  పార్టీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, గోవాడ షుగర్స్‌ మాజీ చైర్మన్‌ మల్లునాయుడు, మాజీ ఎంపీపీ పెదబాబుల సహకారంతో అన్ని పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులు విజయం సాధిస్తారన్నారు. రెండేళ్ల వైసీపీ పాలన అరాచకంగా ఉందని, ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. పంచాయతీల్లో చేసిన అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. ఎలాగైనా పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించాలని వైసీపీ నేతలు అడ్డదారులు వెతుకుతున్నారని, అధికారుల సాయంతో ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ చాలాచోట్ల ప్రభుత్వ ఉద్యోగులు, వలంటీర్లు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, వారిపై టీడీపీ నేతల నిఘా ఉందని,  తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో గోవాడ షుగర్స్‌ మాజీ చైర్మన్‌ బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎంపీపీ పెదబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-01T06:36:31+05:30 IST