ఏజెన్సీలో రోడ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-10-29T04:42:10+05:30 IST
ఏజెన్సీ ప్రాంతంలో వివిధ గ్రామాలను కలుపుతూ నిర్మిస్తున్న రహదారుల పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు.

అధికారులకు కలెక్టర్ ఆదేశం
విశాఖపట్నం, అక్టోబరు 28: ఏజెన్సీ ప్రాంతంలో వివిధ గ్రామాలను కలుపుతూ నిర్మిస్తున్న రహదారుల పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం ఆయన ఐటీడీఏ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, ట్రాన్స్కో తదితర శాఖల అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని, 2025 నాటికి శత శాతం పనులు పూర్తి చేయాలన్న లక్ష్యం మేరకు అధికారులు పనిచేయాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం లేని 110 గ్రామ సచివాలయాలలో సమీపంలోని మండల కార్యాలయాల నుంచి ఫైబర్ నెట్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
పాడేరు, అరకు ఆస్పత్రులలో వచ్చే నెల నుంచి ప్రసవాలు, జనరల్ సర్జరీ, చిన్నపిల్లలు, ఎముకల వైద్యం, కంటి ఆపరేషన్లకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.