పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు
ABN , First Publish Date - 2021-11-23T06:05:21+05:30 IST
మార్చి నెలలో జరిగే పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికను అమలు చేస్తున్నట్టు ఏజెన్సీ డీఈవో బి.రమేశ్ వెల్లడించారు.
![పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921112312341777/11232021003442n13.jpg)
ఏజెన్సీ డీఈవో రమేశ్
కొయ్యూరు, నవంబరు 22: మార్చి నెలలో జరిగే పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికను అమలు చేస్తున్నట్టు ఏజెన్సీ డీఈవో బి.రమేశ్ వెల్లడించారు. సోమవారం మండలంలో కొయ్యూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజేంద్రపాలెం, రావణాపల్లి ప్రాథమిక పాఠశాలలు, కొయ్యూరు కస్తూర్బాగాంధీ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు. అలాగే రికార్డులను తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల సిబ్బందితో సమావేశమై విద్యా బోధన, పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు ప్రణాళికపై పలు సూచనలు, సలహాలందించారు. ఈ సందర్భంగా ఆయన కేజీబీవీలో కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణతకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్టు చెప్పారు. నాడు-నేడు రెండవ విడతలో ఏజెన్సీకు సంబంధించి 53 పాఠశాలలు ఎంపిక చేసినట్టు చెప్పారు. త్వరలో పాఠశాలల్లో ఉన్న ఖాళీలను సీఆర్టీలతో భర్తీ చేస్తామన్నారు. ఆయన వెంట ఎంఈవో బోడంనాయుడు పాల్గొన్నారు.