రోడ్డెక్కిన తెలుగు తమ్ముళ్లు

ABN , First Publish Date - 2021-10-21T05:15:22+05:30 IST

రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని తెలుగుదేశం సీనియర్‌ నాయకులు గాడు అప్పలనాయుడు విమర్శించారు. వైసీపీ అల్లరిమూకలు టీడీపీ కార్యాలయంపై దాడిచేసి, సృష్టించిన విధ్వంసంపై అధినేత పిలుపు మేరకు నిర్వహించిన రాష్ట్ర బంద్‌లో భాగంగా బుధవారం భీమిలిలో దుకాణాలను మూయించారు, ఆర్టీసీ సిటీ బస్సులను నిలిపివేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మెయిన్‌రోడ్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ శాంతి భద్రతలు భ్రష్టుపట్టిపోయాయని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయాందోళనతో ప్రజలు బతకాల్సిన దుస్థితి వచ్చిందన్నారు.

రోడ్డెక్కిన తెలుగు తమ్ముళ్లు
భీమిలిలో బంద్‌ నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు

 టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడులకు నిరసన 

 అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు 

 ముందస్తుగా నేతల అరెస్టులు


భీమునిపట్నం, అక్టోబరు 20: రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని తెలుగుదేశం సీనియర్‌ నాయకులు గాడు అప్పలనాయుడు విమర్శించారు. వైసీపీ అల్లరిమూకలు టీడీపీ కార్యాలయంపై దాడిచేసి, సృష్టించిన విధ్వంసంపై అధినేత పిలుపు మేరకు నిర్వహించిన రాష్ట్ర బంద్‌లో భాగంగా బుధవారం భీమిలిలో దుకాణాలను మూయించారు, ఆర్టీసీ సిటీ బస్సులను నిలిపివేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మెయిన్‌రోడ్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ శాంతి భద్రతలు భ్రష్టుపట్టిపోయాయని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయాందోళనతో ప్రజలు బతకాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఎస్‌ఐ పి.రాంబాబు గంటస్తంభం కూడలికి చేరుకుని నేతలు గాడు అప్పలనాయుడు, పెంటపల్లి యోగేశ్వరావు, మారోజు సంజీవకుమార్‌, కనకల అప్పలనాయుడు, గండిబోయిన పోలిరాజు, కొక్కిరి అప్పన్న, కంచర్ల కామేష్‌, షేక్‌ అన్వర్‌, సత్తరవు శివ తదితరులను అరెస్ట్‌ చేసి పోలీసుస్ఠేషన్‌కు తరలించారు. కాగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత  పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, జిల్లా తెలుగురైతు ప్రధాన కార్యదర్శి డీఏఎన్‌ రాజు, తమ్మిన సూరిబాబును అరెస్ట్‌ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. 


26 మంది నేతల అరెస్ట్‌, విడుదల

 బంద్‌ సందర్భంగా భీమిలిలో 26 మంది టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి సాయంత్రం విడిచిపెట్టారు. వీరిలో నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు, గంటా నూకరాజు, కార్పొరేటర్‌ గాడు చిన్నికుమారిలక్ష్మి, పాసి నరసింగరావు, డీఏఎన్‌ రాజు, యోగేశ్వరరావు, లీలావతి తదితరులున్నారు. 


తగరపువలసలో ధర్నా

తగరపువలస: టీడీపీ శ్రేణులు బుధవారం తగరపుపువలసలో ధర్నా చేశారు. ప్రభుత్వానికి, మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. భీమిలి ఇన్‌చార్జి కె.రాజబాబు ఆధ్వ ర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో  రెండో వార్డు కార్పొరేటర్‌ చిన్నకుమారి, గంటా నూకరాజు, డీఏఎన్‌ రాజు, తగరపువలస అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.  


మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు  

మంత్రి ముత్తంశెట్టిపై టీడీపీ నేత రాజబాబు పోలీసులకు ఫిర్యాదు చేసి రశీదు తీసుకున్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో మహిళా నేతలతో మంత్రి ఫోన్‌లో మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమంలో వచ్చాయని, దాడికి మంత్రి ప్రధాన కారణమని, అతనిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.  


ముందస్తు అరెస్టులు దుర్మార్గం 

కొమ్మాది:  బంద్‌ నేపథ్యంలో పోలీసులు టీడీపీ నేతలను ముందుగా అరెస్టు చేయడం దుర్మార్గమని  ఆరో వార్డు టీడీపీ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్‌, నేతలు మొల్లి లక్ష్మణరావు పిళ్లావెంకట్రావు, గొల్లంగి ఆనందబాబు విమర్శించారు. వీరందరినీ బుధవారం తెల్లవారుజామునే అరెస్టుచేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయన్నారు. 

 

నేతల హౌస్‌ అరెస్ట్‌

ఆనందపురం: బంద్‌లో స్థానిక నేతలు పాల్గొనకుండా పోలీసులు అడ్డుకున్నారు. ముందుగా హౌస్‌ అరెస్టు చేశారు. భీమిలి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కోరాడ నాగభూషణరావు ఇంటికి తెల్లవారు జామున నాలుగు గంటలకు పోలీసులు చేరుకుని అరెస్టు చేయగా, నేతలు బొద్దపు శ్రీను, సురాల సత్యవరప్రసాదరావును  స్టేషన్‌కు తరలించారు. 

 

నేతల ముందస్తు అరెస్టు

సింహాచలం: ప్రధాన కూడలిలో టీడీపీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫిక్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పోలీసులు నేతలను చెదరగొట్టారు. పార్టీ పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్‌, వార్డు కార్పొరేటర్‌ పిసిని వరాహనరసింహం, పార్టీ అధ్యక్షుడు పంచదార్ల శ్రీనివాస్‌లను ఎస్‌ఐ రఘురామ్‌ అదుపులోకి తీసుకున్నారు. నిరసనలో  సతివాడ శంకరరావు, ఎస్‌.సురేష్‌, ధర్మరాజు, పైడిరాజు, తదితరులు పాల్గొన్నారు. 


మారిన నిరసన వేదిక

మధురవాడ: మధురవాడ నాయకులను పోలీసులు  ముందుగా అరెస్టు చేయడంతో నిరసన వేదికను తగరపువలసకు మార్చారు. అక్కడి నాయకులతో కలసి బంద్‌లో పాల్గొన్నారు. నిరసన ప్రదర్శన నిర్వహించారు. 

Updated Date - 2021-10-21T05:15:22+05:30 IST