ఉపాధ్యాయుల ఆందోళన బాట
ABN , First Publish Date - 2021-07-24T05:58:00+05:30 IST
ప్రభుత్వ ఉపాధ్యాయులు రోడ్డెక్కారు.

ఫ్యాప్టో ఆధ్వర్యంలో జిల్లాలోని 11 కేంద్రాల్లో ధర్నాలు
ఏడు డీఏల విడుదల, సీపీఎస్ రద్దు, వేతన సవరణ అమలు సహా పలు సమస్యల పరిష్కారానికి డిమాండ్
విశాఖపట్నం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో వున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలనే డిమాండ్తో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో జిల్లాలోని భీమునిపట్నం, పెందుర్తి, కె.కోటపాడు, చోడవరం, అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లి, నర్సీపట్నం, చింతపల్లి, పాడేరు, అరకు తహసీల్దార్ల కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. పెండింగ్లో వున్న ఏడు డీఏలను తక్షణమే విడుదల చేయాలని ఫ్యాప్టో నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే వేతన సవరణ వెంటనే అమలు చేయాలని కోరారు. అధికారంలోకి వచ్చిన ఏడు రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానన్న జగన్మోహనరెడ్డి...కనీసం ఇప్పటికైనా తన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా సెకండ్వేవ్లో మృతిచెందిన టీచర్ల కుటుంబాలను అదుకోవాలని, గ్రీన్ఛానల్ కింద కారుణ్య నియామకాలు చేపట్టాలని, ప్రభుత్వం నుంచి రావలసిన ఆర్థిక ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉన్నత పాఠశాలల్లో 3,4,5 తరగతుల విలీన ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని ఫ్యాప్టో నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా చాప్టర్ చైర్మన్ ఇ.పైడిరాజు, ప్రధాన కార్యదర్శి పి.సత్యనారాయణ, జి.మధు, వెంకటేశ్వర్లు, బాబూలాల్, చిన్నబ్బాయి. రామకృష్ణ, శాస్త్రి, శామ్యూల్, కృష్ణకుమార్, కోటాన శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు.