కరోనా బాధితులను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2021-06-21T05:30:00+05:30 IST
కరోనా కారణంగా ఉద్యోగ, ఉపాధి రంగాలపై ఆధారపడే పలు కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయని, అటువంటి కుటుంబాలను తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన టీడీపీ, వామపక్షాల నేతలు విజ్ఞప్తి చేశారు.
టీడీపీ, వామపక్ష నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి
కలెక్టరేట్లో డీఆర్ఓకు వినతిపత్రం సమర్పణ
విశాఖపట్నం, జూన్ 21: కరోనా కారణంగా ఉద్యోగ, ఉపాధి రంగాలపై ఆధారపడే పలు కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయని, అటువంటి కుటుంబాలను తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన టీడీపీ, వామపక్షాల నేతలు విజ్ఞప్తి చేశారు. గుంటూరులో జరిగిన పార్టీల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు టీడీపీ, వామపక్షాల నాయకులు సోమవారం కలెక్టరేట్లో డీఆర్ఓను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాదిన్నరగా కరోనా కోరల్లో చిక్కుకుని జనం అల్లాడుతున్నారని చెప్పారు. వృత్తి పనివారు. నిర్మాణ రంగ కార్మికులు. ప్రైవేటు ఉద్యోగులు, చిరు వ్యాపారులు పూర్తిగా చితికి పోయారన్నారు. దాదాపు కోటి మంది రోడ్డున పడ్డారని గుర్తు చేశారు. ప్రజల ఆర్థిక ఇబ్బందులు గుర్తించి తెల్లరేషన్ కార్డు కుటుంబాలకు రూ.10 వేలు, మిగిలిన కుటుంబాలకు రూ.7500 చొప్పున ప్రతినెలా సాయం అందించాలన్నారు.
అలాగే కరోనాతో మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు, ఫ్రంట్లైన్ వారియర్స్ అయితే రూ.50 లక్షలు పరిహారం అందించాలన్నారు. డీఆర్వోను కలిసిన వారిలో టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లాశ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జె.వి.సత్యనారాయణ, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, సీపీఐ నగర కార్యదర్శి ఎం.పైడిరాజు, పార్టీల నాయకులు ప్రగడనాగేశ్వరరావు, గండి బాబ్జి, పి.ప్రసాద్, గోపాల్ తదితరులున్నారు.