విద్యార్థులకు రుచికరమైన భోజనాలు పెట్టాలి
ABN , First Publish Date - 2021-10-29T05:45:22+05:30 IST
తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ గురవారం మధ్యాహ్నం ఆకస్మికంగా సందర్శించారు.
డీఈవో ఎల్.చంద్రకళ
ఆరిలోవ, అక్టోబరు 28: తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ గురవారం మధ్యాహ్నం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన వంటశాలకు వెళ్లి ఆహార పదార్థాలను తనిఖీ చేసి వాటి రుచులను తెలుసుకున్నారు. ఆహార పదార్థాలు రుచికరంగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం మెనూ గురించి ఆమె ఆరా తీశారు. మెనూ ప్రకారం కిచిడి, టమాటా చట్నీ, ఉడకబెట్టిన గుడ్డు విద్యార్థులకు అందిస్తున్నట్టు వంటశాల సిబ్బంది వివరించారు. ఇకపై ఆహారాలను రుచికరంగా తయారు చేయాలని ఆమె ఆదేశించారు. మరోసారి పాఠశాలకు వచ్చినప్పుడు ఇక్కడే భోజనం చేస్తానన్నారు. పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులను త్వరితంగా పూర్తి చేయాలన్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని మరింత పెంచాలని, వారికి అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలను బోధించి మంచి ఫలితాలను సాధించాలన్నారు. ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మార్కులకు గ్రేడులు నిర్ణయించాలని డీఈవో పేర్కొన్నారు.