గంజాయి నియంత్రణకు పటిష్ఠ చర్యలు

ABN , First Publish Date - 2021-10-28T06:12:22+05:30 IST

గంజాయి సాగు, రవాణాను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా రూరల్‌ ఎస్పీ బి.కృష్ణారావు అన్నారు.

గంజాయి నియంత్రణకు పటిష్ఠ చర్యలు
మాట్లాడుతున్న ఎస్పీ కృష్ణారావు

రూరల్‌ ఎస్పీ కృష్ణారావు

చింతపల్లి, అక్టోబరు 27: గంజాయి సాగు, రవాణాను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా రూరల్‌ ఎస్పీ బి.కృష్ణారావు అన్నారు. బుధవారం చింతపల్లి వచ్చిన ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ, ఏవోబీలోని మారుమూల ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్నారని, శివారు గ్రామాలకు రహదారి సదుపాయం లేకపోవడం, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడం వల్ల సాగు నియంత్రణకు ఇబ్బందిగా వుందని అభిప్రాయపడ్డారు. తెలిసో తెలియకో గంజాయి సాగు, రవాణాకు పాల్పడుతూ గిరిజన యువత విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఎస్పీ అన్నారు. గంజాయి వల్ల కలిగే నష్టాలను ఆదివాసీలకు వివరిస్తున్నామని, వారిలో మార్పు వస్తున్నదని, ధారకొండ, అరకులోయ ప్రాంతాల్లో గిరిజనులు స్వచ్ఛందంగా గంజాయి తోటలను ధ్వంసం చేశారన్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా గంజాయి మొక్కలు నరికివేయాలని, ఇందుకు పోలీసు శాఖ ప్రోత్సాహం అందిస్తుందన్నారు.  


10 నెలల్లో 400 గంజాయి కేసులు

గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడానికి ప్రత్యేక నిఘా పెట్టామని ఎస్పీ కృష్ణారావు చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 400 గంజాయి కేసులు నమోదయ్యాయని, వీటికి సంబంధించి 950 మంది నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. గంజాయి రవాణాను అడ్డుకునేందుకు చెక్‌పోస్టులను ఏర్పాటుచేశామన్నారు. ఎస్పీ వెంట చింతపల్లి ఏఎస్పీ తుషార్‌ డుడి, కిందిస్థాయి పోలీసు అధికారులు వున్నారు. 

Updated Date - 2021-10-28T06:12:22+05:30 IST