‘స్టీల్ప్లాంట్’పై రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి
ABN , First Publish Date - 2021-12-09T06:14:08+05:30 IST
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ కమిటీ అఽద్యక్షుడు, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు.

టీడీపీ విశాఖ పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
గాజువాక, డిసెంబరు 8: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ కమిటీ అఽద్యక్షుడు, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. ఉక్కు ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు 300 రోజులు పూర్తయిన సందర్భంగా పాతగాజువాకలో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో బుధవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ గంగవరం పోర్టు ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించి, విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటామని చెప్పడం అనుమానాలకు తావిస్తున్నదని వివరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులు, కార్మికుల పక్షాన నిలబడి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రైవేటీకరణను అడ్డుకోవాలన్నారు. వైసీపీ ఎంపీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలన్నారు. గతంలో విశాఖ స్టీల్ప్లాంట్కు ఇదే పరిస్థితి వస్తే నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, ప్రైవేటీకరణ నుంచి కాపాడారని గుర్తు చేశారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా తెలుగుదేశం పార్టీ రాజీలేని పోరాటాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోగంటి లెనిన్బాబు, స్టీల్ టీఎన్టీయూసీ అధ్యక్షుడు నమ్మి సింహాద్రి, నాయకులు రామ్మోహన్కుమార్, కొల్లి నాగేశ్వరరావు, కాకి స్వరూపరాణి, కొట్ని లక్ష్మి, పల్లా పెంటారావు, పంచదార్ల ఉగ్రం, గుమ్మడి నరేంద్ర, నాగార్జున, లక్ష్మణరావు, నంబారు సింహాద్రి, నామాల అర్జున్, నమ్మి అప్పారావు, కోన సోమినాయుడు పాల్గొన్నారు.