‘ఉపా’ పేరుతో రాజ్య హత్యలు
ABN , First Publish Date - 2021-07-09T04:55:45+05:30 IST
లక్ష్యం చేసుకున్న వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం ఉపా చట్టం పేరుతో నిర్బంధించి హింసతో పరోక్ష హత్యలకు పాల్పడుతోందని విదసం ప్రతినిధులు ఆరోపించారు.

ఆదివాసీ హక్కుల నేత స్టాన్ స్వామిది హత్యే
అంబేడ్కర్ విగ్రహం ఎదుట విదసం ప్రతినిధుల నిరసన
విశాఖపట్నం, జూలై 8: లక్ష్యం చేసుకున్న వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం ఉపా చట్టం పేరుతో నిర్బంధించి హింసతో పరోక్ష హత్యలకు పాల్పడుతోందని విదసం ప్రతినిధులు ఆరోపించారు. ఆదివాసీ హక్కులనేత ఫాదర్ స్టాన్ స్వామి జ్యుడీషియల్ రిమాండ్లోనే చనిపోవడాన్ని నిరసిస్తూ విద సం ఆధ్వర్యంలో పలు క్రైస్తవ సంఘాలు, ఆదివాసీలు, దళిత సంఘాల ప్రతినిధులు గురువారం డాబాగార్డెన్స్ అంబే డ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక కన్వీనర్ బూసివెంకటరావు మాట్లాడుతూ కనీసం మంచినీరు తాగలేని 84 ఏళ్ల మతబోధకుడిపై ఎన్ఐఏ కక్షగట్టి తొమ్మిది నెలలుగా జైలులో నిర్బంధించి, చివరికి అతన్ని పొట్టన పెట్టుకుందని ఆరోపించారు.
దళిత క్రైస్తవ హక్కుల ఫోరంనేత చిట్టిబాబు, రోమన్ కేథలిక్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోనస్వామినాథం, క్రైస్తవ ససంఘాల ఫెడరేషన్ ప్రతినిధి డాక్టర్ అనిల్పాల్, ఆర్సీఎం క్రైస్తవ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర డినాయిల్, పి.ఆర్.కె.ప్రసాద్, నిర్మలలు మాట్లాడుతూ దైవప్రవక్తలాంటి ఫాదర్ స్టాన్ స్వామిని హింసించి క్రైస్తవులను భయభ్రాంతులకు గురిచేయాలని చూశారని, ఇది మతస్వేచ్ఛకు విఘాతం కలిగించడమే నన్నారు. ఈ కార్యక్రమంలో విదసం కో కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ, ఎస్.ఆర్.వేమన, దేవుడు, సుజాత, సుధాకర్, పాపారావు, కృష్ణారావు, సత్యనారాయణ పాల్గొన్నారు.