వ్యాక్సిన్ కోసం పడిగాపులు
ABN , First Publish Date - 2021-05-18T04:11:48+05:30 IST
శ్రీహరిపురం జీవీఎంసీ ఆస్పత్రికి సోమవారం రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకోవడానికి అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు.
మల్కాపురం, మే 17 : శ్రీహరిపురం జీవీఎంసీ ఆస్పత్రికి సోమవారం రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకోవడానికి అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. అయితే ఇక్కడ కొవాగ్జిన్ మాత్రమే వేశారు. స్టాక్ లేని కారణంగా కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేయలేదు. దీంతో చాలా మంది నిరాశతో వెనుదిరిగారు. రోజూ శ్రీహరిపురం జీవీఎంసీ ఆస్పత్రికి ఏడు వార్డుల నుంచి దాదాపుగా ఐదారొందల మంది వ్యాక్సిన్స్ కోసం వస్తున్నారు. అయితే ఇక్కడ వంద నుంచి నూటయాభై మందికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తుండడం వల్ల మిగతా వారు నిరాశతో ఇంటి ముఖం పడుతున్నారు. కాగా ఏ రోజు ఏ వ్యాక్సిన్ వేస్తారో ఉదయం 9 గంటల వరకు ఇక్కడి సిబ్బందికి సమాచారం తెలియకపోవడం వల్ల జనానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. అధికారులు ఒక రోజు ముందుగా ఏ వ్యాక్సిన్ వేసేది సమాచారం ఇస్తే బాగుంటుందని సిబ్బంది అంటున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చిన వారు భౌతిక దూరం పాటించకుండా తోసుకుంటుండడంతో పలువురు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయాలు, సామాజిక భవనాల్లో ఎక్కడికక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడితే రద్దీ తగ్గుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.