అనధికార ఇళ్లు క్రమబద్ధీకరించుకోండి
ABN , First Publish Date - 2021-10-22T06:33:05+05:30 IST
ప్రభుత్వ స్థలాల్లో అనుమతులు లేకుండా నిర్మించుకున్న ఇళ్లను నెలాఖరులోగా క్రమబద్ధీకరించుకోవాలని ఆర్డీవో జె.సీతారామారావు తెలిపారు.
ఆర్డీవో సీతారామారావు
తుమ్మపాల, అక్టోబరు 21: ప్రభుత్వ స్థలాల్లో అనుమతులు లేకుండా నిర్మించుకున్న ఇళ్లను నెలాఖరులోగా క్రమబద్ధీకరించుకోవాలని ఆర్డీవో జె.సీతారామారావు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 225 జీవో ప్రకారం పోరంబోకు, కొండపోరంబోకు, గయాలు భూముల్లో 75 నుంచి 300 గజాలలోపు ఆక్రమించి కట్టుకున్న ఇళ్లను భూమి విలువను చెల్లించి క్రమబద్ధీకరించుకోవచ్చన్నారు. అంతకు పైబడి ఆక్రమణలో ఉన్న వారిని గుర్తించి తొలగిస్తామని ఆయన తెలిపారు. 2019 అక్టోబరు 15వ తేదీ నాటికి ఇంటి పన్ను రశీదు, కరెంటుబిల్లు తదితర పత్రాలు తప్పక ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు, డీటీ వెంకటరమణ, ఆర్ఐలు ఈశ్వరరావు, ముంతాజ్బేగం పాల్గొన్నారు.