ఆంక్షల్లో స్వల్ప సడలింపు
ABN , First Publish Date - 2021-12-31T06:26:01+05:30 IST
నూతన సంవత్సరం సందర్భంగా విధించిన ఆంక్షలను స్వల్పంగా సడలించినట్టు ట్రాఫిక్ ఏడీసీపీ సీహెచ్ ఆదినారాయణ తెలిపారు.

నేటి రాత్రి ఎనిమిది గంటల వరకూ బీచ్రోడ్డులో ఉండేందుకు అవకాశం
పది గంటలకు బీఆర్టీఎస్ రోడ్డు, ఫ్లై వోవర్లు మూసివేత
బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు వద్దు
విశాఖపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరం సందర్భంగా విధించిన ఆంక్షలను స్వల్పంగా సడలించినట్టు ట్రాఫిక్ ఏడీసీపీ సీహెచ్ ఆదినారాయణ తెలిపారు. యారాడ నుంచి భీమిలి వరకూ బీచ్రోడ్డును రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఖాళీ చేయిస్తామన్నారు. పది గంటల తరువాత బీచ్రోడ్డు, బీఆర్టీఎస్ కారిడార్లతోపాటు తెలుగుతల్లి, ఎన్ఏడీ ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్టు తెలిపారు. ఇంతకుముందు ఆయా రోడ్లను సాయంత్రం ఐదు గంటల నుంచే మూసివేయనున్నట్టు సీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రజా ప్రతినిధుల నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో ఆంక్షలను సడలించినట్టు తెలిసింది. అయితే నగరవాసులు సామాజిక బాధ్యతగా బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై వేడుకలు జరుపుకోవద్దని ఏడీసీపీ కోరారు. శబ్దాలు చేస్తూ వాహనాలను నడిపిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.