చిత్రసీమలో సిరివెన్నెలకు ప్రత్యేక స్థానం
ABN , First Publish Date - 2021-12-31T06:21:38+05:30 IST
తెలుగు సినిమా రంగంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రత్యేక స్థానం పొందారని డైమండ్ హిట్స్ చైర్మన్, వైసీపీ నాయకుడు దాడి రత్నాకర్ అన్నారు.
![చిత్రసీమలో సిరివెన్నెలకు ప్రత్యేక స్థానం](https://media.andhrajyothy.com/appimg/galleries/1921123112495669/12312021005050n83.jpg)
సంస్మరణ సభలో డైమండ్హిట్స్ చైర్మన్ రత్నాకర్
అనకాపల్లి టౌన్, డిసెంబరు 30: తెలుగు సినిమా రంగంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రత్యేక స్థానం పొందారని డైమండ్ హిట్స్ చైర్మన్, వైసీపీ నాయకుడు దాడి రత్నాకర్ అన్నారు. గవరపాలెం వీవీ రమణ ఆడిటోరియంలో గురువారం సిరివెన్నెల సంస్మరణ సభ జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ, సీతారామశాస్త్రి అనకాపల్లిలో పుట్టి పెరిగి విద్యాభ్యాసం చేసి చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం పొందారన్నారు. ఇది అనకాపల్లి ప్రాంతవాసులు చేసుకున్న అదృష్టమన్నారు. సిరివెన్నెల సాహిత్యం అన్ని తరాల వారికి మధురంగా ఉంటుందని, ఆయన పాట కోసం ప్రాణం పెడతారని పేర్కొన్నారు.
ఆకట్టుకున్న సిరివెన్నెల సాహితీ నీరాజనం
సిరివెన్నెల సంస్మరణ సభలో భాగంగా సినీ సంగీత దర్శకుడు, కల్యాణి నృత్య సంగీత అకాడమీ వ్యవస్థాపకులు ఇంద్రగంటి లక్ష్మీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సిరివెన్నెల సాహితీ నీరాజనం శ్రోతలను ఆకట్టుకుంది. సినిమా రంగంలో అడుగుపెట్టి సిరివెన్నెల సినిమాకు రాసిన పాటతో నీరాజనం కార్యక్రమం ప్రారంభమైంది. పలు సినిమాలకు సిరివెన్నెల రచించిన పాటలను లక్ష్మీశ్రీనివాస్ ఆధ్వర్యంలో గాయనీ, గాయకులు ఆలపించగా శ్రోతలు కూడా ఎంతో క్రమశిక్షణతో ఆస్వాదించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొణతాల మురళీకృష్ణ, కాండ్రేగుల కృష్ణ అప్పారావు, మళ్ల రాజా, ఎస్.బాబి, సూరిశెట్టి రమణఅప్పారావు, మాజీ కౌన్సిలర్ కేఎం నాయుడు పాల్గొన్నారు.