లంబసింగిలో ట్రైఫుడ్ పార్కు ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2021-07-08T05:45:39+05:30 IST
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన రెండు ట్రైఫుడ్ పార్కుల్లో ఒకదానిని లంబసింగి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ట్రైఫెడ్ రీజనల్ మేనేజర్ సందీప్ శర్మకు విజ్ఞప్తి చేసినట్టు భారతీయ ఆదివాసీల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గడుతూరి రామ్గోపాల్ తెలిపారు.

భారతీయ ఆదివాసీల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రామ్గోపాల్
ట్రైఫెడ్ ఆర్ఎం సందీప్ శర్మకు వినతిపత్రం
చింతపల్లి, జూలై 7: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన రెండు ట్రైఫుడ్ పార్కుల్లో ఒకదానిని లంబసింగి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ట్రైఫెడ్ రీజనల్ మేనేజర్ సందీప్ శర్మకు విజ్ఞప్తి చేసినట్టు భారతీయ ఆదివాసీల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గడుతూరి రామ్గోపాల్ తెలిపారు. ట్రైఫెడ్ ద్వారా రాష్ట్రానికి రెండు ట్రైఫుడ్ పార్కులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, వీటిలో ఒకదానిని కురుపాం ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. మరో ఫుడ్ పార్కును లంబసింగి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ట్రైఫెడ్ ఆర్ఎం సందీప్ శర్మను బుధవారం విశాఖలో టీం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు జయంతి బురడతో కలిసి వినతిపత్రం అందజేసినట్టు చెప్పారు. చింతపల్లి, జీకేవీధి మండలాల్లో ఆదివాసీ రైతులు పలు రకాల పంటలను సాగుచేస్తున్నారని, అధిక విస్తీర్ణంలో కాఫీ తోటలు వున్నాయని, రాజ్మా పంటను మహారాష్ట్ర తర్వాత చింతపల్లి, జీకేవీధి మండలాల్లోనే అత్యధికంగా సాగు చేస్తున్నారని సందీప్ శర్మకు వివరించినట్టు ఆయన తెలిపారు. గిరిజన రైతులు పండిస్తున్న ఉద్యాన, వ్యవసాయ, సుగంధ ద్రవ్య పంటలకు గిట్టుబాటు ధరలు లభించడానికి, వ్యవసాయ పురోగతి కోసం లంబసింగిలో ట్రైఫుడ్ పార్కుని ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని ట్రైఫెడ్ రీజనల్ మేనేజర్కి వివరించామన్నారు.