రోడ్డెక్కిన ఉపాధ్యాయులు
ABN , First Publish Date - 2021-07-30T05:41:15+05:30 IST
డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయులు రోడ్డెక్కారు.
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్)
సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు
ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు
డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. విద్యా రంగంలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం జిల్లాలోని అనకాపల్లి, మాడుగుల, నర్సీపట్నం, చింతపల్లి, నక్కపల్లి, పాడేరు, ఎలమంచిలి, చోడవరం, అరకులోయల్లో ఉపాధ్యాయులు ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆరోపించారు. సీపీఎస్ రద్దు, నూతన పీఆర్సీ ప్రకటన, ఉమ్మడి సర్వీసు రూల్స్ అమలు, పెండింగ్లో వున్న ఏడు డీఏలు మంజూరు, యాప్ల రద్దు, డీఎస్సీ నోటిఫికేషన్ జారీ, మునిసిపల్ ఉపాధ్యాయులకు పీఎఫ్ సౌకర్యంతోపాటు పోస్టులు అప్గ్రేడ్ చేసి ప్రమోషన్లు కల్పించడం, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు మంజూరు, ప్రతి నెలా ఒకటో తేదీన జీతాల చెల్లింపు, తదితర 29 డిమాండ్లను అమలు చేయాలంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీటిని సత్వరమే అమలు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం స్థానిక అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.