బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించాలి
ABN , First Publish Date - 2021-06-22T05:45:00+05:30 IST
రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని జిల్లా అదనపు వైద్యాధికారి (ఏడీఎంహెచ్వో) లీలాప్రసాద్ అన్నారు.
ఏడీఎంహెచ్వో లీలాప్రసాద్
ముంచంగిపుట్టు, జూన్ 21: రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని జిల్లా అదనపు వైద్యాధికారి (ఏడీఎంహెచ్వో) లీలాప్రసాద్ అన్నారు. సోమవారం ఆయన స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రాలను సందర్శించారు. ల్యాబ్, మందుల గదిని తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. ఇక్కడ అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, రోగులకు సకాలంలో సంపూర్ణ వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ప్రస్తుతం వ్యాధుల సీజన్ కావడంతో పలు రకాల వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో విధిగా ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించి వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు. అలాగే సీహెచ్సీ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీహెచ్సీలో డిప్యుటేషన్పై అదనపు వైద్యాధికారిని నియమించినట్టు చెప్పారు. కరోనా వైరస్ బారిన పడకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్సీ ఇన్చార్జి డాక్టర్ కృష్ణారావు, ఎపిడమిక్ సెల్ హెచ్ఈవో సింహాద్రి పాల్గొన్నారు.