అనంత ‘సమస్యల’ సాగరం

ABN , First Publish Date - 2021-10-28T06:24:00+05:30 IST

ప్రభుత్వాలు మారుతున్నా గిరిజనుల కష్టాలు తీరడం లేదు. అన్నిరంగాల్లో వెనుకబడి వున్న వీరిపట్ల పాలకులు కనికరం చూపడం లేదు.

అనంత ‘సమస్యల’ సాగరం
అనంతసాగరం గ్రామం


అభివృద్ధికి దూరంగా గిరిజన గ్రామం

రోడ్లు, కాలువలు వంటివి కరువు

ఇళ్ల ముందు మురుగు తిష్ఠతో అవస్థలు

వీధిలైట్లు లేక రాత్రివేళ అంధకారం


గొలుగొండ, అక్టోబరు 27: ప్రభుత్వాలు మారుతున్నా గిరిజనుల కష్టాలు తీరడం లేదు. అన్నిరంగాల్లో వెనుకబడి వున్న వీరిపట్ల పాలకులు కనికరం చూపడం లేదు. ఫలితంగా ఏ గ్రామంలో చూసినా సమస్యలే దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల కనీస సౌకర్యాలు సైతం లేకపోవడం విశేషం. ఇదే కోవలోకి వస్తుంది గొలుగొండ మండలం అనంతసాగరం గిరిజన గ్రామం. ఇక్కడ అన్నీ సమస్యలే.  చిన్నయ్యపాలెం  పంచాయతీ  శివారున ఉన్న ఈ గ్రామంలో  35 వరకు నివాస గృహాలు ఉన్నాయి. మూడు చోట్ల వీధి రోడ్లు నిర్మించాల్సి ఉన్నా పట్టించుకునేవారు లేరు. నాలుగేళ్ల క్రితం రోడ్ల నిర్మాణానికి పిక్కరాయి వంటివి ఏర్పాటు చేసినా పనులు మాత్రం ముందుకు సాగలేదు.  ఫలితంగా రాళ్లు తేలిన రోడ్లపై రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఇక  తాగునీటి విషయానికి వస్తే.. ఎక్కడికక్కడ పైప్‌లైన్లు లీకేజీలు కావడం వల్ల చాలా వరకు తాగునీరు వృథాగా పోతోంది. ప్రధానంగా ఇక్కడి వారిని మురుగు సమస్య వేధిస్తోంది. గ్రామంలో  అవసరమైన కాలువులు నిర్మించక పోవడంతో ఇళ్ల ముందు వాడుక నీరు తిష్ఠ వేస్తోంది. దీంతో దోమలు పెరిగి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని అక్కడివారు వాపోతున్నారు. ఈ దుర్వాసన కారణంగా అంటు వ్యాధుల భయం వెంటాడుతోందని చెపుతున్నారు. వీధిలైట్లు కూడా సరిగా లేవని అంటున్నారు. ఇదిలావుంటే, ఇక్కడి వారికి గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో చాలా వరకు పూర్తి కాలేదు. బిల్లులు మంజూరు కాకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. ప్రతిసారి ఎన్నికల సమయాల్లో అష్టకష్టాలు పోటీలో ఉన్నవారు తమ గ్రామానికి రావడం,  హామీలు గుప్పించడం వెళ్తుండడం మినహా  పూర్తిస్థాయిలో అమలు చేసిన దాఖాలు లేవని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తమ గ్రామంలో సమస్యలపై స్పందించాల్సిందిగా అంతా కోరుతున్నారు.

Updated Date - 2021-10-28T06:24:00+05:30 IST